
తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తిత్వాలలో చిత్తూరు వి. నాగయ్య ఒకరు. అభినయ త్యాగరాజుగా, రామ భక్తుడిగా, అపార దాతృత్వ గుణం కలిగిన మనిషిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఆయన చివరి రోజుల్లో ఎదురైన దయనీయ పరిస్థితులు తెలిస్తే గుండె బరువెక్కుతుంది. గుంటూరు జిల్లా రేపల్లెలో ఉప్పలదడియం నాగయ్య శర్మగా జన్మించిన ఆయన, చిన్ననాటి నుంచే కరుణ, దయ కలిగిన వ్యక్తి. తండ్రి రామలింగేశ శర్మ ఇచ్చిన సలహా, “మంచిగా పది మందిలో నమ్మకాన్ని కూడగట్టుకో, కష్టపడి పని చేయి, ఉన్నదానితో పది మందికి సహాయం చేయి” అనేది నాగయ్య జీవితానికి మార్గదర్శకమైంది. రేపల్లె నుండి చిత్తూరు జిల్లాకు వలస వచ్చి 13 ఏళ్ల వయసు నుంచే నాటకాల్లో నటించడం ప్రారంభించారు. భక్త ప్రహ్లాదుడిగా, భక్త రామదాసుడిగా, శ్రీకృష్ణుడిగా అనేక పాత్రల్లో రాణించి నాటక రంగంలో అఖండ కీర్తిని పొందారు. ఆయన ఆలపించిన కీర్తనలకు జమీందారులు ఫిదా అయి, కట్టల కొద్దీ రూపాయలు సమర్పించేట్ వారట. వాటిని తనతోపాటు నటించిన కళాకారులకు పంచిన గొప్ప మనసు ఆయనది. కీర్తనలు ఆలపించడంలో నాగయ్య గారు ఎంతటి ఖ్యాతి గడించారంటే, పాటలు పాడితే ఘంటసాలే పాడాలి, కీర్తనలు ఆలపిస్తే నాగయ్యే ఆలపించాలి అని తరువాతి కాలంలో సినీ ప్రముఖులు చెప్పుకునేవారు. కే.జె. ఏసుదాసు సైతం త్యాగయ్య చిత్రంలో నాగయ్య ఆలపించిన తీరును చూసి ప్రశంసించారు.
సినిమాల్లోకి రాకముందే, నాగయ్య గారు స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ పిలుపు మేరకు మద్యపాన నిషేధ కార్యక్రమాలలో పాల్గొని దేశ ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఈ దశలో ఆయన వ్యక్తిగత జీవితంలో అనేక విషాదాలు సంభవించాయి. భార్యాబిడ్డ మరణించడం, రెండవ భార్య గర్భవతిగా మరణించడం, ఆ వెంటనే తండ్రి మరణించడం వంటివి ఆయనను తీవ్రంగా ప్రభావితం చేశాయి. జీవితంపై ఆశ కోల్పోయి వైరాగ్యంతో ఉన్న ఆయనను స్నేహితులు నాటకాలు, గ్రామ్ఫోన్ రికార్డుల వ్యాపకంతో మళ్ళీ మామూలు మనిషిని చేశారు.
కుటుంబ పరిస్థితుల దృష్ట్యా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు నాగయ్య. తండ్రి మరణం తర్వాత వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బుతో నిర్మాతగా మారాలని ప్రయత్నించినా, మోసపోయి డబ్బు కోల్పోయారు. నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నించి, హెచ్.ఎం. రెడ్డి కంటపడి 1938లో గృహలక్ష్మి చిత్రంతో 34 ఏళ్ల వయసులో వెండితెరకు పరిచయమయ్యారు. అప్పటి నుండి ఆయన వెనుదిరిగి చూడలేదు. భక్త పోతనలో పోతనగా, యోగి వేమనలో వేమనగా తన అద్భుతమైన నటనతో యావత్ దేశాన్ని మంత్రముగ్ధులను చేశారు. తొలి చిత్రం తర్వాత వందేమాతరంలో అభ్యుదయ యువకుడిగా, దేవతలో కాస్త నెగటివ్ టచ్ ఉన్న పాత్రలోనూ ఒదిగిపోయి మెప్పించారు. నాగయ్య కేవలం నటుడిగానే కాకుండా, గాయకుడిగా కూడా అఖండ కీర్తిని పొందారు. కీర్తితో పాటు భారీగా ఆస్తిపాస్తులను సంపాదించుకున్నారు. అప్పట్లోనే లక్షరూపాయల రెమ్యునరేషన్ అందుకునే రేంజ్ కు వెళ్లారు. కాస్ట్లీ కారులు , పదుల సంఖ్యలో బంగ్లాలు, ఎంతో విలాసవంతగా మహారాజుగా బ్రతికారు నాగయ్య. అప్పటిలో తమినాడు ప్రతి వీధిలో ఆయనకు ఓ ఇల్లు ఉండేదట.. కానీ ఆయన దానం చేసే గుణంతో అంతా పోగొట్టుకున్నారు. ఆఖరి రోజుల్లో అంతా పోగొట్టుకొని చివరి రోజుల్లో దహనసంస్కారాలు కూడా డబ్బులు కుటుంబ సభ్యులు అడుక్కునే పరిస్థితి వచ్చిందట. 60ఏళ్ళ వయసులో అనారోగ్యంతో పాటు డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు నాగయ్య. చివరకు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ రోజుకు వెయ్యి రూపాయిలు తీసుకున్నారట. చివరి రోజుల్లో ఆయన ఆకలి బాధలుఎదుర్కున్నారట.