
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన చిత్రం శాకుంతలం. ఇందులో మలయాళీ నటుడు దేవ్ మోహన్, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కీలకపాత్రలలో నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. కాళీదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. శకుంతల దుష్యంతుల అమరప్రేమగాథ శాకుంతలం ఈ నెల 14న విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి ముంబై మీడియాతో పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు సమంత. అజరామరమైన ప్రేమగాథ గురించి సామ్ పలు విషయాలను పంచుకున్నారు.
సమంత మాట్లాడుతూ.. “నేను చిన్నప్పటి నుంచీ డిస్నీ జోనర్ సినిమాలను చాలా ఇష్టపడేదాన్ని. నేను ఆనందంగా ఉన్నా వాటిని చూసేదాన్ని. బాధలో ఉన్నా వాటినే చూసేదాన్ని. శాకుంతలం సినిమాలో యువరాణిగా నటించడం చాలా ఆనందంగా, ప్రత్యేకంగా అనిపించింది. ఆ పాత్రలో అంత పర్ఫెక్ట్ గా చేయడం చాలా సంతోషంగా ఉంది. శాకుంతలం కథ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఆలోచించాను. కాస్త భయపడ్డాను. కానీ, కొన్నేళ్లుగా సవాళ్లను స్వీకరించడం నాకు అలవాటైపోయింది. నిర్మాత దిల్రాజుగారికి స్క్రిప్ట్ మీద చాలా నమ్మకం ఉంది. నా చిన్నతనంలో శకుంతల పాత్ర గురించి చాలా కలలు కనేదాన్ని. అమ్మాయిలు, మహిళలు, ఫ్యామిలీలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ పాత్రలో నటిస్తున్నంత సేపు ఓ ప్రేక్షకురాలిగా నేను సినిమాను ఆస్వాదించాను. ఇది సింపుల్గా చెప్పేసే కథ కాదు. ఇందులో ప్రేమ ఉంది. మోసం ఉంది. అంతకు మించిన భావోద్వేగాలు చాలానే ఉన్నాయి. ఎన్నో శతాబ్దాలకు పూర్వం రాసిన క్లిష్టమైన కథ ఇది”
“సకుటుంబసపరివార సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. మండు వేసవిలో కుటుంబమంతా కూర్చుని చూడాల్సిన సినిమా. డిస్నిఫైడ్కి సిద్ధంగా ఉండండి. నా దృష్టిలో దర్శకుడు గుణశేఖర్ ఫెమినిస్ట్. ఆయన ఫీమేల్ ఓరియంటెడ్ కథలు రాస్తారు. రిస్క్ తీసుకోవడానికి భయపడరు. గొప్ప గొప్ప కథలను మహిళల చుట్టూ ఆసక్తికరంగా నడపాలని ప్రయత్నిస్తారు” అంటూ చెప్పుకొచ్చారు సామ్..