Mental Krishna: ‘నేను నైటీ వేసుకోలేను’.. పోసాని ‘మెంటల్ కృష్ణ’ మూవీని రిజెక్ట్ చేసిన తెలుగు హీరో ఎవరో తెలుసా?
ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన మెంటల్ కృష్ణ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో పోసాని కృష్ణమురళి ఒకరు. 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పని చేసిన ఆయన నటుడిగానూ, డైరెక్టర్ గానూ సత్తా చాటాడు. ముఖ్యంగా పోసాని దర్శకత్వంలో వచ్చిన ఆపరేషన్ ధుర్యోధన సినిమా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషనే క్రియేట్ చేసింది. దీంతో పాటు శ్రావణ మాసం, ఆపద మొక్కుల వాడు, మెంటల్ కృష్ణ, రాజావారి చేపల చెరువు, దుశ్వాసన వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇందులో మెంటల్ కృష్ణ అనే సినిమాలో పోసాని హీరోగా నటించాడు. అతని పక్కన సత్య కృష్ణన్ కథానాయికగా చేసింది. బ్రహ్మానందం, రఘుబాబు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మోహన్ మీడియా క్రియేషన్స్ పతాకం క్రింద వడ్లపట్ల మోహన్ నిర్మించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించాడు. 2009 జనవరి 01న విడుదలైన మెంటల్ కృష్ణ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఈ సినిమా పలు రకాలుగా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఇందులో పోసాని గెటప్పులు అందరి దృష్టిని ఆకర్షించాయి. అందులోనూ ఈ సినిమాలోని చాలా సన్నివేశాల్లో నైటీలో కనిపిస్తాడు పోసాని.
బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచిన ఈ మెంటల్ కృష్ణ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు పోసాని. అదేంటంటే..ఈ సినిమాను మొదట వేరే హీరోతో అనుకున్నారట పోసాని. అయితే అతను ఒప్పుకోకపోవడంతో అతనే హీరోగా చేశారట. ఆ హీరో మరెవరో కాదు వేణు తొట్టెంపూడి. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన పోసాని తన మెంటల్ కృష్ణ సినిమా గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘ మెంటల్ కృష్ణ సినిమా ఒక హీరో కథ. వేణు కోసమే ఈ కథ రాశాను. చూడ్డానికి ఒడ్డూ, పొడవు బాగుంటాడని, వాకింగ్ స్టైల్ కూడా చక్కగా ఉంటుందని అతని కోసమే ఈ స్టోరీ రాసి పెట్టాను. కథ కూడా వినిపించాను. వేణు కూడా చాలా బాగా నచ్చిందన్నాడు. అయితే నైటీ వేసుకోలేనని సినిమాను రిజెక్ట్ చేశాను. ఆ విషయాన్ని నేను నిర్మాతలకు చెప్పాను. సినిమాను ఆపేద్దామన్నాను. కానీ నిర్మాత మాత్రం సినిమాను ఎందుకు ఆపేస్తారు? మీరే ఆ రోల్ చేయండి. దీంతో నేనే లీడ్ రోల్ చేశాను. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. మొదటి రోజు ఫస్ట్ మార్నింగ్ షోకే మేం పెట్టిన డబ్బులు వచ్చేశాయి. ఆ తర్వాత 30 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. అయితే నైటీలు, చీరలు వేసినంత మాత్రాన సినిమాలు ఆడవు. కథ బాగుంటేనే హిట్ అవుతాయి’ అని పోసాని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




