Tollywood: తెలుగులో అత్యధిక ఫ్యాన్స్ వచ్చిన మూవీ ఈవెంట్ ఏదో తెలుసా..?
ఇప్పుడంటే.. ప్రి రిలీజ్ ఈవెంట్స్ అంటున్నాం కానీ.. ఒకప్పుడు మూవీ ఈవెంట్ అంటే ఆడియో రిలీజ్ ఈవెంటే. అప్పట్లో సినిమా వేడుకలకు భారీ జన సందోహాలు హాజరయ్యేవి. అయితే హైయ్యస్ట్ జనం.. ఏ చిత్రానికి హాజరయ్యారు.. అది ఏ హీరో సినిమా ఈ కథనంలో తెలుసుకుందాం ..

తెలుగు సినిమా హిస్టరీలో నెవర్ బిఫోర్ మూవీ ఈవెంట్ ఏది అంటే.. అందరూ చెప్పే ఏకైక పేరు ఆంధ్రావాలా. ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం తెలుగు సినిమా చరిత్రలో ఒక అపూర్వ ఘట్టంగా నిలిచిపోయింది. ఈ వేడుకకు తొమ్మిది నుండి పది లక్షల మంది అభిమానులు హాజరయ్యారని చెబుతుంటారు. పెద్ద పెద్ద రాజకీయ ర్యాలీలకు కూడా సాధ్యం కాని ఈ భారీ జనసందోహం, ఎన్టీఆర్ ప్రజాదరణకు నిదర్శనంగా మారింది. ఈ అసాధారణమైన జన ప్రవాహాన్ని తట్టుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడపాల్సి వచ్చింది. ఇది ఆడియో విడుదల కార్యక్రమాల చరిత్రలోనే ఒక అద్భుతమైన సంఘటనగా ఫిల్మ్ జర్నలిస్టులు చెబుతుంటారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజలు ఒక చోట చేరినా, కార్యక్రమం అవాంఛనీయ సంఘటనలు లేకుండా, శాంతియుతంగా జరగడం విశేషం. ఎవరికీ ఎలాంటి హాని కలగకుండా, ఒక్క ఘటన కూడా నమోదు కాకపోవడం ఆశ్చర్యకరం.
యాంకర్ సుమ కనకాల ఆంధ్రావాలా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించిన తన అనుభవాలను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం అప్పట్లో పెద్ద ఎత్తున జరిగింది. అప్పుడు ఏర్పడిన భారీ జనసందోహం కారణంగా ఎదురైన గందరగోళ పరిస్థితిని సుమ వివరించారు. కార్యక్రమానికి హాజరయ్యే వారి కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారని, అయితే ఆ కార్యక్రమం భారీ జనసందోహం కారణంగా చాలా దారుణంగా మారిందని సుమ గుర్తు చేసుకున్నారు. ఆ రోజు జరిగిన సంఘటనను వివరిస్తూ, తాను ఒక రైలుకు ఇన్ఛార్జ్గా ఉన్నానని సుమ తెలిపారు. అయితే, అభిమానుల భారీ రద్దీ కారణంగా వారు నిమ్మకూరు వరకు మాత్రమే చేరుకోగలిగారని, అక్కడి నుంచి కార్యక్రమ వేదికకు వెళ్లడం కుదరలేదని చెప్పారు. ప్రజల గుంపును చూసి, తాము వెనుకకు తిరిగి రావాల్సి వచ్చిందని, కార్యక్రమానికి వెళ్ళకుండానే తాము పారిపోయామని ఆమె పేర్కొన్నారు. హెలికాప్టర్ ద్వారా ఇతర ప్రముఖులు వేదిక వద్దకు చేరుకున్నారని, అయితే తాము మాత్రం చేరుకోలేకపోయామని సుమ వివరించారు. ఆంధ్రావాలా ఆడియో ఆవిష్కరణ అనేది అప్పటి టాలీవుడ్ చరిత్రలో ఒక చిరస్మరణీయ సంఘటనగా మిగిలిపోయింది.
అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, తనకు ఆర్థికంగా మంచి లాభాల్ని ఇచ్చింది ఈ చిత్ర నిర్మాత ఆవుల గిరి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్లకు చాలా డబ్బును తిరిగి చెల్లించినా, జూనియర్ ఎన్టీఆర్కు, పూరీ జగన్నాథ్కు అనుకున్న దానికంటే ఎక్కువ చెల్లించినా కూడా తనకు లాభాలు మిగిలాయని వివరించారు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.
