AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanthi Swaroop: తండ్రి అంత్యక్రియలకు రూ.2వేలు లేక శాంతి స్వరూప్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవ్..

జబర్దస్త్ శాంతి స్వరూప్ తన కుటుంబ నేపథ్యాన్ని, కష్టాలను వివరించారు. తండ్రి మరణించినప్పుడు అంత్యక్రియలకు 2000 కూడా లేని పరిస్థితిని గుర్తుచేసుకున్నారు. కుటుంబం పేదరికంలో ఉన్నా, తన తల్లిదండ్రులు డబ్బు ఆశించలేదన్నారు. ఇప్పుడు తల్లిని చూసుకుంటున్నా, గ్రామ వాతావరణం ఆమెకు నచ్చడంతో అక్కడే ఉంచినట్లు తెలిపారు.

Shanthi Swaroop: తండ్రి అంత్యక్రియలకు రూ.2వేలు లేక శాంతి స్వరూప్ కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవ్..
Shanthi Swaroop
Ram Naramaneni
|

Updated on: Feb 14, 2026 | 1:29 PM

Share

జబర్దస్త్ నటుడు శాంతి స్వరూప్ టాకింగ్  తన కుటుంబ నేపథ్యం గురించి వివరంగా పంచుకున్నారు. ఆయన మాటల్లో కుటుంబం అనుభవించిన పేదరికం, కష్టాలు, తండ్రి మరణం తాలూకు విషాద సంఘటనలు కళ్లకు కట్టినట్టు కనిపించాయి. ఐదుగురు సోదరులు, తల్లిదండ్రులతో కూడిన తన కుటుంబం ఒకప్పుడు అత్యంత పేదరికంలో జీవించిందని శాంతి స్వరూప్ తెలిపారు. 2001లో హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఫోన్లు లేని కాలంలో లేఖల ద్వారా, లేదా ఎస్టీడీ బూత్‌లకు వెళ్లి నాణేలు వేసి తన మావయ్యకు ఫోన్ చేసి.. తన గురించి తెలుసుకునేవారని గుర్తుచేసుకున్నారు. అప్పుడు తన తల్లిదండ్రులు ఎప్పుడూ డబ్బు పంపమని అడగలేదని, “నువ్వు బాగా ఉంటే చాలు” అని చెప్పేవారని వివరించారు. ఆ రోజుల్లో తన తండ్రి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ, కుటుంబానికి మెడిసిన్ కొనే స్థోమత కూడా లేదని శాంతి స్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద హాస్పిటల్‌కు వెళ్లే స్థితి లేక, ఆర్ఎంపీ డాక్టర్లను ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. తన సోదరులు కూడా కూలి పనులు, డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారని తెలిపారు.

2007లో తన తండ్రి మరణించినప్పుడు, తాను ఆర్థికంగా ఏ మాత్రం నిలదొక్కుకోలేదని, అంత్యక్రియలకు రూ.2000 కూడా లేని దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నానని ఆయన వివరించారు. అప్పుడు హైదరాబాద్‌లో తనకు తెలిసినవారికి ఫోన్ చేసి, తన పక్కింటి వారి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇచ్చి రూ.2000 సాయం పొంది, ఆ డబ్బుతో తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశానని గుర్తుచేసుకున్నారు. ఆ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, కొడుకుగా తన తండ్రికి కనీస సాయం కూడా చేయలేకపోయానని బాధపడ్డారు. తండ్రి మరణం తర్వాత గ్రామంలో తనకు ఒక గుర్తింపు వచ్చిందని, సినిమా రంగంలో ఉన్నాడు కాబట్టి శాంతి బాగా సంపాదించి ఉంటాడని అందరూ అనుకునేవారని, కానీ అది కష్టాల సమయమని చెప్పారు. 2011లో కెవ్వు కేక ప్రొగ్రాం, 2013లో జబర్దస్త్ షోలతో శాంతి స్వరూప్ గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన తల్లి ఒక సోదరుడి వద్ద గ్రామంలో ఉంటున్నారు. తల్లికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఆమెకు మంచి వైద్యం అందించే స్థితిలో తాను ఉన్నానని శాంతి స్వరూప్ తెలిపారు. తన తల్లి గ్రామీణ వాతావరణాన్ని, నలుగురితో కలిసి మాట్లాడటాన్ని ఇష్టపడుతుందని, నగరంలో ఒంటరిగా ఫీల్ అవుతారని, అందుకే ఆమె స్వేచ్ఛను దూరం చేయకూడదని గ్రామంలోనే ఉంచినట్లు చెప్పారు. తరచుగా వెళ్లి ఆమెను కలుస్తుంటానని, ఫోన్‌లో మాట్లాడుతుంటానని వివరించారు. తన తల్లి, సోదరులు జబర్దస్త్ షోను రెగ్యులర్‌గా చూస్తారని, తన లేడీ గెటప్‌లను ఎంజాయ్ చేస్తారని తెలిపారు. ఇప్పుడు తన సోదరులు కూడా స్థిరపడ్డారని, వారి వారి కుటుంబాలను చూసుకుంటున్నారని పేర్కొన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి