Tollywood : టాలీవుడ్లో సమ్మె సైరన్.. బుధవారం నుంచి షూటింగ్స్ బంద్.. ఈ సినిమాలపై ప్రభావం..
తెలుగు సినిమా సైజ్ పెరిగిందని, మన దగ్గరినుంచే పాన్ ఇండియా సినిమాలు ప్రొజెక్ట్ అవుతున్నాయని వార్తలు వింటున్నామే గాని.. దాని ఫలితం తమకు మాత్రం దక్కడం లేదంటున్నారు టాలీవుడ్ సినీ కార్మికులు.
తెలుగు చిత్ర పరిశ్రమలో సమ్మె సైరన్ మోగింది.. తమకు వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు పిలుపునిచ్చారు.. అంతేకాకుండా రేపటి నుంచి షూటింగ్లకు దూరంగా ఉండనున్నట్లు తెలిపారు.. ట్వంటీఫోర్ ఫ్రేమ్స్కి అసలు ఆధారమైన ట్వంటీఫోర్ క్రాఫ్ట్స్… సినిమా రంగానికి ఆయువు పట్టులాంటి ఈ విభాగాలకు చెందిన కార్మికులందరూ సమ్మె బాట పట్టబోతున్నారు. లైట్మెన్ నుంచి డైరెక్టర్స్ దాకా… 24 అనుబంధ సంఘాలకు చెందినవాళ్లు ఈ సమ్మెలో పాల్గొంటారు. సినిమాటోగ్రాఫర్స్, జూనియర్ ఆర్టిస్టులు, రైటర్స్ ఇలా అందరూ షూటింగ్స్కి దూరం పాటించబోతున్నారు. ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు తప్ప మిగతా అందరూ ఈ సమ్మెలో పాలుపంచుకుంటారని తెలుస్తోంది.
తెలుగు సినిమా సైజ్ పెరిగిందని, మన దగ్గరినుంచే పాన్ ఇండియా సినిమాలు ప్రొజెక్ట్ అవుతున్నాయని వార్తలు వింటున్నామే గాని.. దాని ఫలితం తమకు మాత్రం దక్కడం లేదంటున్నారు టాలీవుడ్ సినీ కార్మికులు. వేతనాలు పెంచేవరకు సహాయ నిరాకరణ చేయాలని డిసైడయ్యారు. రేపు ఉదయం ఫెడరేషన్ ముట్టడికి నిర్ణయం తీసుకున్నారు. శ్రమదోపిడీని ఆపేసి… గతంలో తమకిచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చాలన్నది సినీ లేబర్ ఫైనల్ డిమాండ్ చేస్తోంది. తమ సమస్యలపై ఎప్పటినుంచో చెబుతున్నా పట్టించుకోలేదని, ఫిలిం ఛాంబర్కు నోటీసిచ్చినా ప్రయోజనం లేదని, అందుకే ఇలా సమ్మె బాట పట్టామని చెబుతోంది తెలుగు సినిమా కార్మికుల సమాఖ్య. సినీ పెద్దలు జోక్యం చేసుకుని తమ గోడు వినాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్న పెద్ద సినిమాలన్నీ ఈ సమ్మెతో ఇబ్బంది పడబోతున్నాయి. మెగాస్టార్ చిరింజీవి నటిస్తున్న మూడు సినిమాలు, ప్రభాస్-నాగీ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్-కే, చెర్రీ-శంకర్ సినిమా, బాలయ్య-గోపీచంద్ మలినేని మూవీ, సల్మాన్- వెంకటేష్ కాంబినేషన్ మూవీ… దాదాపుగా 15 చిన్నాపెద్దా సినిమాలు ఇప్పుడు షూటింగ్ స్టేజ్లో ఉన్నాయి.
ఈ సినిమాలపై ప్రభావం ఉండబోతుంది..
* మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న భోళా శంకర్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది.
* ప్రభాస్ నాగ్ అశ్విన్ దీపిక పదుకొనె కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా షూటింగ్ శంకర పల్లిలో జరుగుతుంది.
* సల్మాన్ ఖాన్ వెంకటేష్ కభి ఈద్ ఖభి దివాలి సినిమా షూటింగ్ కోకా పెట్లో జరుగుతుంది.
* విజయ్ దేవరకొండ సమంత నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7ఎకర్స్ లో జరుగుతుంది.
* విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న జనగణమన షూటింగ్ ముంబయ్లో జరుగుతుంది.
* రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.
* సాయి ధరమ్ తేజ్ కార్తిక్ దండు డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.
* ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
* అల్లరి నరేష్ ఏ ఆర్ మోహన్ దర్శకత్వంలో నటిస్తున్న ఇట్లు మారేడు మిల్లీ ప్రజానీకం సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి.