
బిగ్బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ డీమాన్ పవన్ కుటుంబంలో ఇటీవల తీవ్ర విషాదం నెలకొంది. అతని తండ్రి దుర్గా ప్రసాద్ క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. దీంతో డీమాన్ పవన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. అలాగే బిగ్బాస్ సన్నిహితులు, అభిమానులు, నెటిజన్లు పవన్ కు సంతాపం ప్రకటించారు. దుర్గా ప్రసాద్ ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థించారు. ఇదిలా ఉంటే తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న డీమాన్ పవన్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. అందులో తన తండ్రి మరణంపై సోషల్ మీడియాలో వస్తోన్న కొన్ని వార్తలు, థంబ్ నెయిల్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ప్లీజ్..దయ చేసి నా తండ్రి మరణవార్తను వ్యూస్ కోసం కంటెంట్గా మార్చకండి. జీవితంలో కొన్ని క్షణాలు గౌరవానికి అర్హమైనవి, కేవలం వ్యూస్ కోసం కాదు. నా తండ్రి అంత్యక్రియలు నేనే నిర్వహించాను’ అని పవన్ పేర్కొన్నాడు.
కాగా తండ్రి అంత్యక్రియల కోసం కొంతమంది బిగ్బాస్ కంటెస్టెంట్స్ పవన్కు భారీగా ఆర్థిక సాయం చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను పవన్ ఖండించాడు. ‘నాకు ఎవరూ ఆర్థికంగా సహాయం చేయలేదు. వ్యూస్, హైప్ కోసం తప్పుడు థంబ్నెయిల్స్ పెట్టడం, తప్పుడు వార్తలు పోస్ట్ చేయడం, షేర్ చేయడం ఆపండి. వ్యూస్ కోసం మరీ దిగజారకండి. ఈ క్లిష్ట కాలంలో కొంతమంది ఫోన్ చేసి నాకు నైతిక మద్దతు ఇచ్చారు. వారికి నా ధన్యవాదాలు. అలాగే అంత్యక్రియలకు వచ్చి నా పక్కన నిలబడిన వారికి నేను కృతజ్ఞుడిని’ అని తన పోస్టులో రాసుకొచ్చాడు పవన్. ప్రస్తుతం ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు, అభిమానులు పవన్ కు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి విషాద సమయాల్లో యూట్యూబ్ ఛానెళ్లు బాధ్యతగా వ్యవహరించాలని కోరుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.