- Telugu News Photo Gallery Cricket photos Sanju samson return team india playing xi ishan kishan gautam gambhir wrath ind vs eng t20
IND vs ENG 3rd T20I: సంజూ శాంసన్ రీఎంట్రీ.. గంభీర్ ఛీ కొట్టనున్న ఆ స్టార్ ప్లేయర్ ఎవరంటే?
Sanju Samson Return Team india Playing XI: వరుస ఓటములతో సతమతమవుతున్న టీమిండియాను తిరిగి విజయాల బాట పట్టించాలంటే కోచ్ గౌతమ్ గంభీర్ కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఫామ్ లేమితో నెమ్మదిగా ఆడుతున్న ఇషాన్ కిషన్పై వేటు వేసి, ఒంటిచేత్తో మ్యాచ్ను గెలిపించగల సత్తా ఉన్న సంజూ శాంసన్కు తుది జట్టులో అవకాశం కల్పిస్తారో లేదో రాబోయే మ్యాచ్ల్లో తేలనుంది.
Updated on: Jul 06, 2026 | 1:28 PM

టీ20 ప్రపంచకప్ గెలిచిన జోష్లో ఉన్న భారత్కు యూకే పర్యటన తీవ్ర నిరాశను మిగిల్చింది. వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ, జట్టులోకి ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ను తిరిగి తీసుకోవాలనే డిమాండ్ ఊపందుకుంది. అయితే, సంజూ తుది జట్టులోకి వస్తే కోచ్ గౌతమ్ గంభీర్ వేటు వేయబోయే ఆ కీలక ఆటగాడు ఎవరో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

భారత జట్టు 2026 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ఆడిన నాలుగు మ్యాచ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతుల్లో టీమిండియా వరుసగా పరాజయాలు చవిచూసింది. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్తో జరిగిన రెండో టీ20లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించడం కోసం, ఏకంగా ప్రపంచకప్లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన సంజూ శాంసన్పై వేటు వేశారు. కేవలం మూడు ఇన్నింగ్స్లలో విఫలమయ్యాడనే కారణంతో భారత్కు మూడో ప్రపంచకప్ అందించిన స్టార్ ఆటగాడిని పక్కన పెట్టడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుత భారత తుది జట్టును పరిశీలిస్తే అగ్ర వరుసలోని ఏడుగురు బ్యాటర్లలో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే ఇలా ఏకంగా ఆరుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లే ఉన్నారు. ఒకే శైలి కలిగిన ఆటగాళ్లు వరుసగా ఉండటం వల్ల ప్రత్యర్థి బౌలర్లకు లైన్ అండ్ లెంగ్త్ మార్చాల్సిన అవసరం లేకుండా పోతోంది. ఇది బౌలర్ల పనిని మరింత సులువు చేస్తోంది. ఈ తరుణంలో కుడిచేతి వాటం కలిగిన సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకుంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మిడిల్ ఆర్డర్లో సమతుల్యత వస్తుంది.

రెండో టీ20కి ముందు తిలక్ వర్మపై వేటు పడుతుందని భావించినప్పటికీ, అతను 11 బంతుల్లో 24 పరుగులు చేసి జట్టుకు మంచి ముగింపునిచ్చాడు. దీంతో ఇప్పుడు అందరి కళ్లు ఇషాన్ కిషన్పైనే పడ్డాయి. ఈ పర్యటనలో ఇషాన్ ప్రదర్శన దారుణంగా ఉంది. ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్లలో కేవలం 13 పరుగులు చేసిన ఇషాన్, ఇంగ్లాండ్పై ఆడిన రెండు మ్యాచ్లలో 49 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా రెండో టీ20లో అతను 40 బంతుల్లో 49 పరుగులు చేసినప్పటికీ, అతని నెమ్మదైన బ్యాటింగ్ (122 స్ట్రైక్ రేట్) వల్ల మిడిల్ ఓవర్లలో భారత్ వెనుకబడి మ్యాచ్ను చేజార్చుకోవాల్సి వచ్చింది.

పిచ్పై బంతి కాస్త స్వింగ్ అయినా, బౌన్స్ అయినా ఇషాన్ కిషన్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అతను అంతర్జాతీయ టీ20లలో సాధించిన 1390 పరుగులలో ఏకంగా 1100 పరుగులు భారతదేశంలోని ఫ్లాట్ పిచ్లపైనే వచ్చాయి. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఐర్లాండ్ వంటి దేశాలలో అతని స్ట్రైక్ రేట్ మరియు సగటు చాలా పేలవంగా ఉంది. ప్రస్తుత యూకే పర్యటనలో మూడో స్థానంలో ఆడుతున్న ఇషాన్ నాలుగు మ్యాచ్లలో కలిపి కేవలం 62 పరుగులు మాత్రమే చేసి ఘోరంగా విఫలమయ్యాడు.

ఒకవేళ గంభీర్ కఠిన నిర్ణయం తీసుకుని ఇషాన్ కిషన్ను పక్కన పెడితే, సంజూ శాంసన్ నేరుగా మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉంది. సంజూకు అంతర్జాతీయ క్రికెట్లోనే కాకుండా, ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున మూడో స్థానంలో ఆడి భారీగా పరుగులు (3096) సాధించిన అనుభవం ఉంది. సంజూ జట్టులోకి వస్తే వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా కొనసాగుతారు మరియు ఇషాన్ కిషన్ బెంచ్కే పరిమితం కాక తప్పదు.
