నటి రన్యా రావుకు రూ.102 కోట్ల జరిమానా.. షోకాజ్ నోటీసులు జారీ!
హై ప్రొఫైల్ బంగారు అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావుతోపాటు మరో ముగ్గురికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. మొత్తం నలుగురు నిందితులకు ఏకంగా రూ.270 కోట్ల జరిమానా విధించింది. ఈ మేరకు మంగళవారం..

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలనం సృష్టించిన కన్నడ నటి రన్యారావుకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) బిగ్షాక్ ఇచ్చింది. ఆమెకు ఏకంగా రూ.102.55 కోట్ల జరిమానా విధించింది. ఈ హై ప్రొఫైల్ బంగారు అక్రమ రవాణా కేసులో నటి రన్యా రావుతోపాటు మరో ముగ్గురికి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) షో-కాజ్ నోటీసులు జారీ చేసింది. మొత్తం నలుగురు నిందితులకు ఏకంగా రూ.270 కోట్ల జరిమానా విధించింది. 127.3 కిలోల అక్రమ రవాణా బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కన్నడ పోలీసులు మార్చి 3న నటి రన్యను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కేసు విచారణలో ఉండగా ఈ రోజు DRI తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా రన్యాకు ఏకంగా రూ.102.55 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం జైలు లోపల ఆమెకు నోటీసులు అందజేశారు. బకాయిలు చెల్లించకపోతే నిందితుల ఆస్తులను జప్తు చేస్తామని అధికారులు హెచ్చరించారు.
ఈ కేసులో 72.6 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినందుకు తరుణ్ కొండూరు రాజును దోషిగా తేల్చడంతో రూ.62 కోట్ల జరిమానాను విధించింది. ఇక 63.61 కిలోల గోల్డ్ అక్రమ రవాణాకు బాధ్యులుగా తేలిన సాహిల్ జైన్, భరత్ జైన్ ఇద్దరికీ రూ.53 కోట్లు చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. DRI తన షో-కాజ్ నోటీసులతోపాటు 2500 పేజీలకు పైగా పత్రాలను అందించింది. ఈ మేరకు కస్టమ్స్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద చర్యలు చేపట్టింది. దీనిపై త్వరలోనే ప్రాసిక్యూషన్ చేపడతామని అధికారులు సూచించారు.
మరోవైపు ఈ కేసుకు సంబంధించిన COFEPOSA (విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం) పిటిషన్ను హైకోర్టు నేడు విచారించి తదుపరి విచారణను సెప్టెంబర్ 11కి వాయిదా వేసింది.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.








