Thyagaraju: వందల సినిమాల్లో విలన్గా చేసిన ఈ నటుడు గుర్తున్నారా? పాపం చిన్న వయసులోనే ఎలా చనిపోయారంటే?
తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన వారిలో త్యాగరాజు ఒకరు. అప్పట్లో ఏడాదికి పదికి పైగా సినిమాలు చేసిన ఘనత ఈ నటుడి సొంతం. అయితే చాలా మంది లాగే ఈ తెలుగు నటుడు చాలా చిన్న వయసులోనే హఠాన్మరణం చెందారు.

త్యాగరాజు.. ఈ తరం ఆడియెన్స్ కు పెద్దగా గుర్తుండిపోవచ్చు కానీ.. కానీ 1970-90 తరం ప్రేక్షకులకు ఈ నటుడు బాగా గుర్తుండే ఉంటారు. ఎందుకంటే తెలుగు సినిమాల్లో ఈయన పోషించిన విలన్ పాత్రలు అలాంటివి. వందల సినిమాల్లో కరడు గట్టిన విలన్ పాత్రలు పోషించరు త్యాగరాజు. తన నటనతో ఆడియెన్స్ ను సైతం భయపెట్టి వణికించారు. తెలంగాణలోని వరంగల్ జిల్లా హన్మకొండ ప్రాంతానికి చెందిన త్యాగరాజు స్టేజిపై నాటకాలు వేస్తుండేవారు. అదే సమయంలో క్రికెట్ ప్లేయర్ గా కూడా రాణించారు. నాటకాలపై ఉన్న ఆసక్తితో వరంగల్లో మిత్రులందరితో కలిసి కాకతీయ కళాసమితి అనే సంస్థను స్థాపించారు త్యాగరాజు. ఈ సంస్థ ఆధ్వర్యంలో చాలా నాటకాలు వేశారాయన. ఇదే క్రమంలో సినిమాల్లో సత్తా చాటాలనే తలంపుతో మద్రాసు వెళ్లారు. అక్కడ దర్శకుడు ప్రత్యగాత్మను కలిశారు. మొదటి సినిమానే ఏకంగా ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం త్యాగరాజుకు దక్కింది. 1964లో మంచి మనిషి సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం ‘పల్నాటి యుద్ధం’, ‘రంగుల రాట్నం’, ‘పట్టుకుంటే పదివేలు’, మంచి మిత్రులు, భలే మొనగాడు, అగ్గి వీరుడు, రక్త సింధూరం, గండికోట రహస్యం, కొరడా రాణి, మంచివాళ్ళకు మంచివాడు, చిక్కడు దొరకడు, మహా బలుడు, పంచ కళ్యాణి – దొంగల రాణి, జాతకరత్నం మిడతంబొట్లు, సీతా కళ్యాణం, మోసగాళ్లకు మోసగాడు, జేమ్స్బాండ్ 777 ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు త్యాగరాజు. సుమారు 25 ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు 130కు పైగా సినిమాలు చేశారాయన. సాంఘిక జానపద, పౌరాణిక, చారిత్రక, కౌబాయ్ చిత్రాల్లో ప్రేక్షకులను భయపెట్టే ప్రతినాయక పాత్రల్లో గొప్పగా రాణించి, వారి హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు.
కేవలం విలన్ గానే కాకుండా ‘పాప కోసం’, ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ తదితర సినిమాల్లో సాత్విక పాత్రలు ధరించి ఆకట్టుకున్నారు త్యాగరాజు. అయితే ఈ నటుడు 50 సంవత్సరాల వయసులోనే అకాల మరణం చెందారు. 1991 ఫిబ్రవరి 24న హైదరాబాదు ఆర్టీసీ క్రాడ్ రోడ్ లోని అశోక్నగర్లో ఉన్న తన సోదరుని ఇంట్లో ఉండగా ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే త్యాగరాజు తుది శ్వాస విడిచారు. ఆయన వెండితెరపై చివరిసారిగా కనిపించిన చిత్రం ప్రేమ ఖైదీ. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో హరీష్, మాలాశ్రీ హీరో, హీరోయిన్లుగా నటించారు. 1991లో రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




