అమ్మ అయ్యాకా మారిన ఆలోచనలు! మాతృత్వం గురించి మనసు విప్పి మాట్లాడిన స్టార్ బ్యూటీ..
అమ్మ అన్న పిలుపులో ఉండే మాధుర్యం వర్ణనాతీతం. ఆ పిలుపు కోసం ప్రతి ఆడపిల్ల కలలు కంటుంది. ఎంతటి స్టార్ హీరోయిన్ అయినా, గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోతున్నా సరే.. పసిపాప స్పర్శ తగిలితే ఆ లోకమే మారిపోతుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో మెప్పించిన ఆ స్టార్ బ్యూటీ విషయంలో కూడా అదే జరిగింది.

పెళ్లై, ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. ఒకానొక దశలో తన కెరీర్, పాపులారిటీని పక్కన పెట్టి సోషల్ మీడియాకు కూడా స్వస్తి చెప్పాలని ఆమె భావించారు. తన కడుపులో పెరిగిన ప్రాణం తన కళ్ల ముందు కదలాడుతుంటే, తనను తాను మర్చిపోయి కూతురి లోకంలోనే ఉండిపోయారు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? తన మాతృత్వ ప్రయాణం గురించి ఆమె పంచుకున్న ఆసక్తికర విశేషాలేంటో తెలుసుకుందాం..
మారిపోయిన ప్రపంచం..
బాలీవుడ్ సెన్సేషన్ ఆలియా భట్ తల్లయ్యాక తన ప్రపంచం ఎలా మారిపోయిందో తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు. మాతృత్వం అనేది ఒక అద్భుతమైన అనుభూతి అని, అది తనను ఒక కొత్త మనిషిగా మార్చిందని ఆమె పేర్కొన్నారు. “గర్భిణీగా ఉన్న తొమ్మిది నెలల్లో శరీరంలోనే కాదు, ఆలోచనల్లో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ఎప్పుడైతే బిడ్డను కళ్లారా చూస్తామో, అప్పుడు మనల్ని మనం పూర్తిగా మర్చిపోతాం. మళ్ళీ ఒకప్పటిలా ఉండాలనుకున్నా అది అసాధ్యం” అని ఆలియా ఎమోషనల్ అయ్యారు.

Alia Bhatt And Raha
రాహా పుట్టిన తర్వాత ఆలియాకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చిందట. నిరంతరం వార్తల్లో, సోషల్ మీడియాలో ఉండటం కంటే తన వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని ఆమె భావించారు. ఇందుకోసం తన సోషల్ మీడియా ఖాతాలను డిలీట్ చేయాలని కూడా అనుకున్నారట. అయితే తన కెరీర్ ప్రారంభం నుంచి తనను సపోర్ట్ చేస్తున్న అభిమానులతో బంధాన్ని తెంచుకోవడం ఇష్టం లేక ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ, తన వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం ఇప్పుడు ఆలియాకు అంతగా నచ్చడం లేదట.
ఫోన్ నిండా రాహా ఫోటోలే..
కూతురు పుట్టిన తర్వాత ఆలియా ప్రయారిటీస్ పూర్తిగా మారిపోయాయి. “నా ఫోన్ తెరిచి చూస్తే మొత్తం రాహా ఫోటోలే కనిపిస్తాయి. నా ఫోటోలు నేను దిగడం కూడా మానేశాను. అప్పుడప్పుడు నేను కూడా ఫోటోలు దిగడానికి ప్రయత్నించాలి” అని ఆమె నవ్వుతూ చెప్పుకొచ్చారు. తన కూతురే తన ప్రపంచమని, ఆమెతో గడిపే ప్రతి నిమిషం ఎంతో విలువైనదని ఆలియా అభిప్రాయపడ్డారు. రణబీర్ కపూర్, ఆలియా భట్ 2022లో వివాహం చేసుకోగా, అదే ఏడాది వారికి రాహా జన్మించిన సంగతి తెలిసిందే.
మరోవైపు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఆలియా తన వృత్తిపరమైన కెరీర్ను కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తన భర్త రణబీర్ కపూర్తో కలిసి ‘లవ్ అండ్ వార్’ అనే సినిమాలో నటిస్తున్నారు. అంతేకాకుండా నిర్మాతగా ‘డోంట్ బీ షై’ అనే సినిమాను కూడా పట్టాలెక్కించారు. తన కూతురు రాహాకు మంచి భవిష్యత్తును ఇవ్వడంతో పాటు, ఒక నటిగా కూడా తన ముద్ర వేయాలని ఆలియా నిరంతరం శ్రమిస్తున్నారు. ఆలియా భట్ పంచుకున్న ఈ మాతృత్వపు ముచ్చట్లు చూస్తుంటే.. సెలబ్రిటీలైనా, సామాన్యులైనా బిడ్డల పట్ల ఉండే ప్రేమ ఒకటేనని అర్థమవుతోంది. రాహా రాకతో ఆలియా జీవితం మరింత పరిపూర్ణమైందని ఆమె మాటలే చెబుతున్నాయి.
