Rajasthan: భార్య కాపురానికి రావాలని బాలుడి నరబలి… మాంత్రికుడి సలహాతో మేనమామ అమనుషం
మనుషి ఏఐ నుంచి అంతరిక్షం దాకా ఎంతో అభివృధ్ది చెందిన ఈ కాలంలోనూ మూఢనమ్మకాల వెంట పరిగెడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. మాంత్రాలకు చింతకాయలు రాలవు అని తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను మంత్రాలు...

మనుషి ఏఐ నుంచి అంతరిక్షం దాకా ఎంతో అభివృధ్ది చెందిన ఈ కాలంలోనూ మూఢనమ్మకాల వెంట పరిగెడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. మాంత్రాలకు చింతకాయలు రాలవు అని తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. తనతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను మంత్రాలు, తంత్రాలతో తిరిగి తన దగ్గరికి రప్పించుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి ఈ క్రమంలో ఓ మాంత్రికుడి సలహా అతన్ని రాక్షసుడిని చేసింది. అమానుషానికి ఒడిగట్టాడు. ఆరేళ్ల చిన్నారిని నరబలి ఇచ్చాడు. ఈ సంఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది.
అల్వార్ జిల్లా సారై కళాన్ గ్రామంలో లోకేశ్ అనే ఆరేళ్ల బాలుడు జులై 19 సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఊరంతా వెతికారు. రాత్రి 8 గంటల సమయంలో ఓ పాడుబడ్డ ఇంట్లో బాలుడి మృతదేహం లభించింది. శరీరంపై సూదులు గుచ్చినట్లుగా గుర్తులు ఉన్నాయి. దీనిపై కేసు నమోదుచేసిన పోలీసుల విచారణ చేపట్టారు. లోకేశ్ మేనమామ మనోజ్ కుమార్ ప్రవర్తన తేడాగా ఉండటంతో అనుమానించారు. తొలుత తాను కూడా బాలుడిని వెతుకుతున్నట్టుగా నటించాడు మనోజ్. అయితే, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారించగా చివరకు నేరాన్ని అంగీకరించాడు.
మనోజ్, అతడి భార్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకురావాలనుకున్నాడు మనోజ్. సునీల్ కుమార్ అనే మాంత్రికుడికి విషయం చెప్పాడు. నరబలి ఇస్తే ఆమె తిరిగొస్తుందని మాంత్రికుడు సలహా ఇచ్చాడు. పూజల కోసం రూ.12,000 నగదు, ఒక చిన్నారి రక్తం, కాలేయాన్ని బలి ఇవ్వాలని చెప్పాడు. అందుకు అంగీకరించిన మనోజ్ తన మేనల్లుడిని ఎంచుకున్నాడు. జులై 19న మధ్యాహ్నం లోకేశ్కు చాక్లెట్ ఆశచూపి ఊరు చివర పాడుబడ్డ భవనానికి తీసుకెళ్లాడు. అక్కడ గొంతునులిమి హత్య చేసి, సిరంజీలతో రక్తం తీసే ప్రయత్నం చేశాడు. అనంతరం శవాన్ని గడ్డి వాము మధ్య దాచిపెట్టాడు. ఆ చిన్నారి కడుపు కోసి కాలేయం తీయడానికి మళ్లీ వచ్చేందుకు ప్లాన్ వేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై తొలుత పోలీసులు గుర్తుతెలియని వ్యక్తుల పనిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనోజ్ పై అనుమానం రావడంతో మరింత లోతుగా విచారించారు. విచారణలో అతడు విస్తుపోయే వాస్తవాలు బయటపెట్టాడు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మాంత్రికుడు సునీల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని నరబలి కేసుల్లో ఇతడి ప్రమేయం ఉందేమో అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.




