కరోనాతో ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ మృతి
భారత్లో ప్రవేశించిన కోవిడ్ వైరస్ కోరలు చాస్తోంది. కొన్నిరాష్ట్రాల్లో కరోనా శాంతించినప్పటికీ మరికొన్ని రాష్ట్రాల్లో ఉగ్రరూపం ప్రదర్శింస్తోంది. ముఖ్యంగా వైరస్ ప్రభావంతో ..

భారత్లో ప్రవేశించిన కోవిడ్ వైరస్ కోరలు చాస్తోంది. కొన్నిరాష్ట్రాల్లో కరోనా శాంతించినప్పటికీ మరికొన్ని రాష్ట్రాల్లో ఉగ్రరూపం ప్రదర్శింస్తోంది. ముఖ్యంగా వైరస్ ప్రభావంతో మహారాష్ట్ర చిగురుటాకుల వణికిపోతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 8068 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనాతో పోరాడుతూ 1188 మంది కోలుకోగా.. 342 మంది మృత్యువాతపడ్డారు. కాగా, ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా కరోనా సోకి మరణించారు.
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా ముంబైలో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కూడా.. కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో ముంబైలో ఓ ట్రాఫిక్ పోలిస్ మరణించారు. కుర్లా ట్రాఫిక్ డివిజన్లో హెడ్ కానిస్టేబుల్ శివాజీ నారాయణ (56) కరోనాతో మరణించినట్లు ముంబైలో పోలీస్ విభాగం తెలిపింది. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. శివాజీ నారాయణ్ మృతి దురదృష్టకరమని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. శివాజీ కుటుంబ సభ్యులు ముంబై పోలీస్ విభాగం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు.
