మంచిర్యాలలో కరోనా కలకలం.. ఒకే రోజు 6 కేసులు
ఏప్రిల్ 14న చెన్నూర్ మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన మహిళ కరోనా వల్ల చనిపోయినట్లుగా
గత కొద్ది రోజులుగా తెలంగాణ జిల్లాలో తగ్గుముఖం పట్టిందనుకున్న కరోనా మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఒకేరోజు ఆరుగురికి కరోనా పాజిటివ్ గా రావటం కలకలం రేపుతోంది.
మంచిర్యాల జిల్లాలో కరోనా కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. గత కొద్ది రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా బయటపడలేదు. వీరంతా ముంబయి నుంచి వచ్చిన వలస కూలీలు కావడం గమనార్హం. కరోనా సోకిన వారిలో హజీపూర్ మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు కాగా, దండేపల్లి మండలం నర్సాపూర్లో మరో ఇద్దరికి కరోనా సోకింది. వీరందరినీ జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు గాంధీ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్సుల్లో తరలించారు.
ఇకపోతే, జిల్లాలోని 7 మున్సిపాలిటీల పరిధిలోనూ ఎలాంటి పాజిటివ్ కేసులు లేవు. జిల్లాలో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడం బాగా తగ్గిందని అధికారులు ఊపిరి పీల్చుకుంటున్న నేపథ్యంలో తాజా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. అంతేకాక, ఏప్రిల్ 14న చెన్నూర్ మండలం ముత్తరావుపల్లి గ్రామానికి చెందిన మహిళ కరోనా వల్ల చనిపోయినట్లుగా నిర్ధారణ అయింది. మంచిర్యాల జిల్లాకు ముంబయి నుంచి ఇటీవలే 120 మంది వలస కార్మికులు వచ్చారు. వీరి విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు.