కరోనా చికిత్సలో కీలకంగా ‘రెమ్డిసివిర్’.. ఇక హైదరాబాద్లో తయారీ..!
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. కోవిద్-19 చికిత్సలో కీలకమైన యాంటీవైరల్ ఔషధం ‘రెమ్డిసివిర్' ఇకపై హైదరాబాద్లోనూ తయారుకానుంది.
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం చాలా దేశాలు వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తున్నాయి. కోవిద్-19 చికిత్సలో కీలకమైన యాంటీవైరల్ ఔషధం ‘రెమ్డిసివిర్’ ఇకపై హైదరాబాద్లోనూ తయారుకానుంది. ఈ ఔషధ తయారీ, పంపిణీ కోసం హైదరాబాద్కు చెందిన హెటిరో ల్యాబ్స్.. అమెరికా సంస్థ గిలీడ్ సైస్సెస్తో నాన్-ఎక్స్క్లూజివ్ లైసెన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
మరోవైపు.. కోవిద్-19 బాధితులకు ఉపశమనం కలిగిస్తున్న రెమ్డిసివిర్కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) ఇప్పటికే అత్యవసర వినియోగ అనుమతి (ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్) ఇచ్చింది. ఈ ఒప్పందం ద్వారా గిలీడ్ నుంచి సాంకేతికత బదిలీ అవుతుంది. రెమ్డిసివిర్ ఔషధాన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు, వివిధ దేశాల నియంత్రణ సంస్థల ఆమోదంతో దీని ఉత్పత్తిని పెంచేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది.
కాగా.. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నుంచి అనుమతి పొందిన వెంటనే హైదరాబాద్లో ఈ రెమ్డిసివిర్ను తయారుచేయనున్నట్టు హెటిరో సంస్థ ప్రకటించింది. ప్రస్తుత సంక్లిష్ట సమయంలో భారత్తోపాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఊరట కల్పించేలా గిలీడ్తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సంతోషదాయకమని హెటిరో గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ పార్థసారథిరెడ్డి తెలిపారు. గిలీడ్తో కుదిరిన ఒప్పందం ప్రకారం సిప్లా సంస్థ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్ (ఏపీఐ)ను తయారుచేసి అంతిమ ఉత్పత్తిని అదే బ్రాండ్ పేరిట 127 దేశాల్లో విక్రయించనున్నది.
అయితే.. కరోనా చికిత్సలో కీలకమైన రెమ్డిసివిర్ ఉత్పత్తి, పంపిణీ కోసం హెటిరోతోపాటు మైలాన్ సంస్థ, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సిప్లా, నోయిడాలోని జుబిలెంట్ లైఫ్సైన్సెస్ సంస్థ కూడా గిలీడ్తో ఒప్పందాలు చేసుకున్నాయి. మొత్తంగా నాలుగు దేశీయ ఫార్మా కంపెనీలతోపాటు పాకిస్థాన్కు చెందిన ఫిరోజ్సన్స్ ల్యాబొరేటరీస్ కూడా గిలీడ్తో ఒప్పందాన్ని కుదుర్చుకొన్నది.