మందుబాబులకు గుడ్న్యూస్… మరిన్ని రాష్ట్రాల్లో డోర్ డెలివరీ సేవలు
మద్యం హోమ్ డెలివరీ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా సూచించింది.
కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ మందుబాబులకు నరకం చూపించింది. మార్చి 25 మద్యం అమ్మకాలు నిలిచిపోవటంతో మద్యం ప్రియుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. లాక్డౌన్ 3.0లో ఆంక్షలు సడిలించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మందుబాబుల కష్టాలు తీరుస్తూ..మద్యం విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మద్యం షాపులకు జనం పోటెత్తుతున్నారు. చాలా మంది భౌతిక దూరం అనే కండిషన్కు నీళ్లు వదిలేశారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి విజృంభించే ప్రమాదం ఉందని విమర్శలు వెలువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్లో మద్యం అమ్మకాలు ప్రారంభించారు. తాజాగా దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పుడు మద్యం డోర్ డెలివరీకే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
మద్యం హోమ్ డెలివరీ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ఇప్పటికే దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా సూచించింది. ఇదే సమయంలో మద్యం విక్రయాలపై స్టే విధించలేమని కూడా స్పష్టం చేసింది. అయితే, వైన్ షాపుల వద్ద భారీ జనసమూహాన్ని అరికట్టేందుకు ‘హోం డెలివరీ’ అవసరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. లేదంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సుప్రీం సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గడ్లు మద్యం హోం డెలివరీకి అనుమతినివ్వగా, కేరళ, మహారాష్ట్రాలు కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అటు మద్యం అమ్మకాలను ఈ- కామర్స్ సైట్ల ద్వారా జరపడానికి అనుమతించాలని స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే కేంద్రాన్ని కోరింది.