కరోనా ఫ్రీ స్టేట్: ఏప్రిల్ 15న లాక్ డౌన్ ఎత్తివేత..
ఈ నెల 14వ తేదీ వరకు దేశం అంతటా లాక్ డౌన్ అమల్లో ఉంది. మరో వారం రోజుల్లో ముగియనుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో కేసుల తీవ్రత నేపథ్యంలో ఈ లాక్డౌన్ షెడ్యూల్ మరింత పొడిగించాలని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ సీఎం ..
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటించింది కేంద్రప్రభుత్వం. ఈ నెల 14వ తేదీ వరకు దేశం అంతటా లాక్ డౌన్ అమల్లో ఉంది. మరో వారం రోజుల్లో ముగియనుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో కేసుల తీవ్రత నేపథ్యంలో ఈ లాక్డౌన్ షెడ్యూల్ మరింత పొడిగించాలని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా లాక్డౌన్ పొడిగించాలనే ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే మరో నెల రోజుల పాటు అయినా ఈ లాక్ డౌన్ పొడిగించక తప్పని పరిస్ధితులు ప్రస్తుతం నెలకొన్నాయని కేసీఆర్ అన్నారు.
ఇదిలా ఉంటే, ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ మాత్రం లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి లాక్ డౌన్ నిబంధనలను సడలించబోతున్నామని ప్రకటించింది. ఆ రోజు నుంచి అన్ని కార్యాలయాలు యథాతథంగా పని చేస్తాయని ఆ రాష్ట్రం ప్రకటించింది. ప్రైవేట్ వ్యాపారాలపై మాత్రం నిషేధం ఉంటుందని తెలిపింది. ఈ నెల 15వ తేదీ నుంచి సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి పాఠశాలలు, విద్యాసంస్థలు మినహా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకుని వస్తామని స్పష్టం చేసింది.
రోడ్లపై అన్ని వాహనాలను అనుమతిస్తామని, వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగుతాయని మేఘాలయ ప్రభుత్వం తెలిపింది.
మేఘాలయలో ఇంత వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో, లాక్ డౌన్ ఆంక్షలను సడలించేందుకు ఆ రాష్ట్రం సిద్ధమవుతోంది. అయితే వైద్య అధికారుల సూచనలను గ్రామీణ ప్రాంత ప్రజలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటన చేసింది. లాక్డౌన్ మరింత కాలం కొనసాగితే వచ్చే ఇబ్బందుల నేపథ్యంలో తాము దీనిని పొడిగించాలనుకోవడం లేదని మేఘాలయ ప్రభుత్వం ప్రకటించింది.