తిరిగి విధుల్లోకి హోంమంత్రి మహమూద్ అలీ..అధికారులతో సమీక్ష!
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం నుంచి తిరిగి తన విధులను ప్రారంభించారు. రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ సోమవారం నుంచి తిరిగి తన విధులను ప్రారంభించారు. రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనా నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వైరస్ మహమ్మారి పట్ల ప్రజలేవరూ భయాందోళనలకు గురికాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ ఇంకా తయారు చేయలేదని మహమూద్ అలీ లిఖితపూర్వక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు, పలువురు ఐపీఎస్ అధికారులతో మంత్రి మహమూద్ అలీ ఫోన్లో మాట్లాడారు.
హోంమంత్రి మహ్మద్ మహమూద్ అలీకి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. మంత్రితో పాటు అతని కుమారుడు, మనవడు కరోనా బారినపడగా..ఆస్పత్రిలో చికిత్స అనంతరం వారు పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జి అయిన సంగతి తెలిసిందే. అతను సాధారణ ఔషధాల నుంచే కోలుకున్నట్లు పేర్కొన్నారు. రోగనిరోధక శక్తిని పెంచడానికి, రోజూ అరగంట వ్యాయామం చేస్తూ బలవర్ధక ఆహారం తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.