Viral Video: మార్చి 21న భారత్ – పాక్ యుద్ధం..! సంచలనంగా మారిన జ్యోతిష్కురాలి వీడియో..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-పాక్ సరిహద్దుల గురించి ఒక వేద జ్యోతిష్కురాలు సోషల్ మీడియాలో చేసిన అంచనాలు వైరల్గా మారాయి. మార్చి 21న గ్రహాల స్థితిగతులు యుద్ధానికి దారితీస్తాయని, అంగారక యోగం ప్రభావంతో భారత సరిహద్దులు విస్తరిస్తాయని ఆమె తెలిపారు. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల అంచనాలు, జోస్యాలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఒక వేద జ్యోతిష్కురాలు, వాస్తు నిపుణురాలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. మార్చి 21న భారత్ పాకిస్తాన్పై దాడి చేసే అవకాశం ఉందని ఆమె చెప్పడం తీవ్ర సంచలనంగా మారింది. వైరల్ అవుతున్న వీడియోలో సదరు మహిళ తన జ్యోతిష్య గణనలను వివరిస్తూ.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. “దయచేసి కొంత నగదు, మందులు, సోలార్ చార్జర్, కనీసం 1-2 నెలలకు సరిపడా ఆహార సామాగ్రితో సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇరాన్ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది. ఒకవైపు నుంచి అఫ్ఘానిస్తాన్, మరోవైపు నుంచి భారత్ పాకిస్తాన్ను చుట్టుముడతాయి” అని ఆమె అని ఆమె తెలిపారు.
జ్యోతిష్య గణనలతో యుద్ధ సూచనలు
మార్చి 21న రిక్త తిథి ఉంటుందని, జాతకంలో 4వ ఇంట్లో బుధుడు, రాహువు, కుజుడు కలిసి అంగారక యోగం ఏర్పడుతుందని ఆమె వివరించారు. ఈ దాడి వల్ల భారత సరిహద్దులు మారుతాయని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి భారతదేశంలోకి రావడానికి ఇది నాంది అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వ్యక్తిగత జాతకంలో మంగళ మహాదశ, దేశ జాతకంలో రాహు అంతర్దశ వంటివి ఈ యుద్ధ సూచనలను బలపరుస్తున్నాయని ఆమె వాదించారు.
నెటిజన్ల ఆగ్రహం..
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కేవలం వ్యూస్ కోసం, వైరల్ కావడం కోసం ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘‘కేవలం కంటెంట్ కోసమే ఇదంతా.. ఎవరూ మంచి కోసం చేయడం లేదు, భయాన్ని పెంచడానికి చేస్తున్నారు’’ అని ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. దయచేసి ప్రజలను భయపెట్టకండి.. ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే అని మరొకరు హితవు పలికారు. మరికొందరు ఈ వ్యాఖ్యలను కొట్టిపారేస్తూ.. ప్రతి జ్యోతిష్కుడు తన అంచనా గొప్పదని నిరూపించుకోవడానికి ఇలాంటి వీడియోలు చేస్తున్నారని విమర్శించారు.
View this post on Instagram
(గమనిక: జ్యోతిష్య శాస్త్ర అంచనాలు అనేవి వ్యక్తుల నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. వీటికి శాస్త్రీయమైన ఆధారాలు ఉండవు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు లేదా యుద్ధం వంటి కీలక విషయాల్లో అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి.)
