మందుబాబులకు రాష్ట్రాలు తలుపులు తెరిచాయి. ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో కూడా బుధవారం నుంచి షాపులు తెరుచుకున్నాయి. ఉదయం నుంచే మందుబాబులు క్యూ కట్టారు. కొన్ని చోట్ల తోపులాటలు కూడా జరిగాయి. ఇదిలా ఉంటే, మద్యం మహమ్మారి ఇటు, కుటుంబాల్లోనూ చిచ్చుపెడుతోంది. కాపురాలను ఛిన్నాభిన్నం చేయడంలో మద్యం ముందుంటుంది.
కరోనా వైరస్ కారణంగా గత 45 రోజులుగా మూసిఉన్న మద్యం దుకాణాలను తెలంగాణలో బుధవారం తెరిచారు. దీంతో మద్యం కొనుగోలుదారులు ఉదయం నుంచి పెద్ద ఎత్తున మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. అయితే కొంతమంది ఫుల్లుగా తాగి ఇంట్లో వారితో గొడవకు దిగుతున్నారు. నగరంలోని బాలా నగర్కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి పూటుగా తాగి భార్యతో వాగ్వాదానికి దిగాడు. లాక్డౌన్ సమయంలో ఎందుకు కొన్నావని భార్య అడిగితే.. తాగిన మైకంలో ఉన్న ప్రసాద్ ఏకంగా బ్లేడుతో శరీరంపై కోసుకోవడం మొదలుపెట్టాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు భార్యాభర్తల గొడవను సర్దుబాటు చేశారు. తీవ్ర రక్త స్రావం అవుతున్న బాధితున్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే, నగరంలో రోడ్లపై వాహనాల రద్దీ పెరిగింది. పలు చౌరస్తాల వద్ద స్వల్పంగా ట్రాఫిక్ జామ్ కనిపించింది. వాహనదార్లు రూల్స్ను పాటించాలని పోలీసుల విజ్ఞప్తి చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ద్విచక్రవాహనంపై ఒక్కరు..కారులో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు.