నిరుద్యోగులకు గుడ్న్యూస్.. వచ్చే మూడేళ్లలో 30 వేల మందికి ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్బాబు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శుభవార్త తెలిపారు. దాదాపు 30 వేల మందికి వచ్చే మూడేళ్లలో ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి శ్రీధర్బాబు తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) శిక్షణ కోర్సు ద్వారా ఈ ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు..

హైదరాబాద్, ఫిబ్రవరి 18: వచ్చే మూడేళ్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) శిక్షణ కోర్సు ద్వారా ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. బీఎఫ్ఎస్ఐ-స్కిల్లింగ్ కోర్సులో శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈ ప్రకటన విడుదల చేశారు. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది జులై వరకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.
వీరికి బ్యాంకింగ్ ఆపరేషన్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్, అప్లికేషన్ అండ్ డేటాబేస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారందరికీ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ)కు సంబంధించిన హైదరాబాద్లోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో ప్లేస్మెంట్స్ కల్పిస్తామన్నారు. ఈ కోర్సు ద్వారా ఏటా 10 వేల మంది బీటెక్, డిగ్రీ పట్టభద్రులకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వీరిలో 5 వేల మంది ఇంజినీరింగ్, మరో 5 వేల మంది డిగ్రీ పూర్తి చేసిన వారు ఉంటారు. ఈ కోర్సు నిర్వహణ ఖర్చును ఎక్విప్ సంస్థ, బీఎఫ్ఎస్ఐల కన్సార్షియం భరిస్తుంది.
శిక్షణ పొందే విద్యార్థులు స్వల్పమొత్తంలో అడ్మిషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఇలా అభ్యర్థుల నుంచి ఒక్కసారి మాత్రమే రూ.5 వేలు వసూలు చేస్తారు. ఇప్పటికే రెండు బ్యాచ్లు విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకున్నాయి. మూడో బ్యాచ్ కోసం ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించగా.. త్వరలోనే మెరిట్ లిస్ట్ వెల్లడిస్తామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. ఉద్యోగ ప్రకటనల కోసం అభ్యర్ధులు స్విల్ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.