TG Govt Jobs: నిరుద్యోగులకు మరో తీపికబురు.. త్వరలో అన్ని వర్సిటీల్లో ఖాళీలు భర్తీ! మంత్రి దామోదర్ ప్రకటన
రాష్ట్ర నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ మరో గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించామని..

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ రాష్ట్రంలోని విద్యా విధానంలో కీలక మార్పులు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించామని, ఎనిమిది కొత్త జూనియర్ కాలేజీలను ప్రారంభించామని, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. అలాగే 11 వేల మంది ఉపాధ్యాయులను, 1,200 మంది లెక్చరర్లను నియమించినట్లు మార్చి 26న శాసనమండలిలో తెలిపారు. విద్యపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ సర్కార్ సంక్షేమానికి, విద్యారంగానికి అధికా ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. మహిళా యూనివర్సిటీకి రూ.500 కోట్లు కేటాయించామని తెలిపారు.
యువతకు ఉద్యోగాలు, ఉపాధి దక్కేలా విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులను ప్రారంభినట్లు వెల్లడించారు. త్వరలోనే యూనివర్సిటీల్లోని ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు. దశాబ్దకాలంగా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే పిల్లల సంఖ్య పెరుగుతోందని, ప్రభుత్వ బడుల్లో విద్యార్ధుల చేరికలు గణనీయంగా తగ్గాయని అన్నారు. దీంతో ఒక్క విద్యార్ధి కూడా చేరని ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా పెరిగిందని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 79 పాఠశాలలను తిరిగి తెరిపించామన్నారు. తల్లిదండ్రులు విద్యలో నాణ్యత కంటే ప్రైవేటు స్కూళ్ల బ్రాండ్నే ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటున్నారుని, అందుకే ప్రభుత్వ స్కూళ్లకు బ్రాండ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందుకోసం సర్వేల్ గురుకుల్ వంటి స్కూళ్లను తయారు చేస్తామని వివరించారు.
విద్యాశాఖ సమూల ప్రక్షాళన చేస్తాం.. సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ రోజురోజుకు క్షీణిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖను సమూల ప్రక్షాళన చేసి.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాజకీయ కోణంలో కాకుండా సామాజిక బాధ్యతగా భావించి సూచనలు, సలహాలు ఇవ్వాలనుకునేవారు విద్యాకమిషన్కు లిఖితపూర్వకంగా అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అఖిలపక్షంలో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నూతన విద్యావిధానం రూపొందిస్తామని చెప్పారు. కొత్తగూడెంలో న్యూ యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ అండ్ సైన్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.