TS EAPCET 2025 Result Date and Time: తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాల తేదీ వచ్చేసింది.. రిజల్ట్స్ ఎప్పుడంటే?
మే 4తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ ఈఏపీసెట్ 2025 ఆన్లైన్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. తాజా ఈ పరీక్షల ఫలితాల విడుదలకు ఉన్నత విద్యామండలి ముహూర్తం ఖరారు చేసింది. తాజా ప్రకటన మేరకు మరో రెండు రోజుల్లోనే ఈఏపీసెట్ ఫలితాలు వెల్లడికానున్నాయి..

హైదరాబాద్, మే 9: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ ఈఏపీసెట్ 2025 ఆన్లైన్ పరీక్షలు మే 4తో ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షల ప్రాథమిక కీ విడుదల చేయగా.. అభ్యంతరాలు స్వీకరించింది. తుది కీ రూపొందించిన ఉన్నత విద్యామండలి ఈఏపీసెట్ ఫలితాల విడుదలకు కూడా ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు మే 11 (ఆదివారం) ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా ఈఏపీసెట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటన జారీ చేసింది. విద్యార్థుల ర్యాంకులతోపాటు మార్కుల జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఈఏపీసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్- ఫార్మసీ విభాగాల ఫలితాల విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 29 నుంచి మే 4 వరకు ఈఏపీ సెట్ ఆన్లైన్ రాత పరీక్షలు వివిధ పరీక్ష కేంద్రాల్లో రోజుకు రెండు ఫిష్టుల్లో జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్ష జరగగా.. మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రవేశ పరీక్ష పరీక్షలు జరిగాయి. ఈఏపీసెట్ ఇంజినీరింగ్ విభాగానికి 2,20,327 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,07,190 మంది అంటే 94.04 శాతం మంది విద్యార్ధులు రాత పరీక్షకు హాజరయ్యారు.
ఇక అగ్రికల్చర్ విభాగం పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 86,762 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 81,198 మంది అంటే 93.59 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. రెండు విభాగాలకు కలిపి దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.