నిరుద్యోగులకు గుడ్న్యూస్.. సెప్టెంబరు నుంచి వరుసగా 15 TGPSC ఉద్యోగ నోటిఫికేషన్లు!
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ నెలాఖరు లేదంటే సెప్టెంబరు నుంచి టీజీపీఎస్సీ వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఇప్పటికే 9 నోటిఫికేషన్లు జారీ చేసిన కమిషన్.. మరో 15 వరకు నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. తాజాగా ఆర్థిక శాఖ అనుమతించిన..

హైదరాబాద్, ఆగస్ట్ 28: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) సిద్ధమవుతోంది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కమిషన్ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ఏడాది ఇప్పటికే తొమ్మిది ఉద్యోగ ప్రకటనలు జారీ చేసిన టీజీపీఎస్సీ.. తాజాగా మరో 15 వరకు నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నెలకు రెండు లేదా మూడు చొప్పున ఈ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉందని సమాచారం.
3,800 పోస్టులకు 15 నోటిఫికేషన్లు
ఇటీవల ఆర్థిక శాఖ అనుమతించిన 3,800 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు టీజీపీఎస్సీకి అందినట్లు తెలుస్తోంది. వీటిలో ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కేటగిరీలకు చెందిన పోస్టులు గణనీయంగా ఉన్నాయి. ఈ పోస్టుల్లో అత్యధికంగా 1,398 అటవీ బీట్ అధికారి (Forest Beat Officer) పోస్టులు ఉన్నట్లు సమాచారం. వీటి తర్వాత టౌన్ ప్లానింగ్, స్టాటిస్టికల్ అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్లను విడుదల చేసే ముందు పోస్టుల సంఖ్య, విద్యార్హతలు, వయోపరిమితి, ఇతర అర్హతలకు సంబంధించిన అంశాలను మరోసారి పరిశీలించి తుది ఆమోదం పొందే అవకాశం ఉంది.
ఇప్పటికే 9 నోటిఫికేషన్లు.. మరో 15కి కసరత్తు
ఈ ఏడాది టీజీపీఎస్సీ ఇప్పటికే తొమ్మిది ఉద్యోగ ప్రకటనలను విడుదల చేసింది. ఆయా నోటిఫికేషన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తయింది. పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై తాత్కాలిక షెడ్యూల్ను సంబంధిత నోటిఫికేషన్లలోనే పేర్కొన్నారు. మిగిలిన పోస్టులకు కూడా దశలవారీగా నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని కమిషన్ భావిస్తున్నట్లు సమాచారం. నియామక ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు టీజీపీఎస్సీ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBRT) నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. పరీక్ష పూర్తయిన వెంటనే అభ్యర్థి సాధించిన స్కోర్ స్క్రీన్పై కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ముందుగానే సిద్ధం చేసిన ప్రాథమిక కీ ఆధారంగా అభ్యర్థికి పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు చూపించే విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
బహుళ సెషన్లలో పరీక్షలు.. నార్మలైజేషన్ విధానం
అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పరీక్షలను ఒకే రోజులో కాకుండా అవసరాన్ని బట్టి బహుళ సెషన్లలో నిర్వహించే అవకాశం ఉంది. వేర్వేరు సెషన్లలో పరీక్షలు నిర్వహించినప్పుడు ప్రశ్నపత్రాల కఠినతలో తేడాలు ఉండే అవకాశం ఉన్నందున మార్కులను నార్మలైజేషన్ విధానంలో లెక్కించనున్నారు. ఈ విధానం ద్వారా వివిధ సెషన్లలో పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కులను సమాన ప్రాతిపదికన పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంజినీరింగ్, టెక్నికల్, ప్రొఫెషనల్ విభాగాలతో పాటు అటవీ, టౌన్ ప్లానింగ్, స్టాటిస్టిక్స్ తదితర రంగాల్లో భారీ సంఖ్యలో పోస్టులు భర్తీ కానుండటంతో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇది కీలక అవకాశంగా మారనుంది. ఈ నెలాఖరు లేదా సెప్టెంబరు నుంచి వరుసగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉండటంతో అభ్యర్థులు ఇప్పటి నుంచే సిలబస్, గత ప్రశ్నపత్రాలు, మాక్ టెస్టులపై దృష్టి పెట్టడం మంచిది.




