రోహిత్, కోహ్లీ కాదు.. ముందు వాళ్లపై ఫోకస్ పెట్టండి.. అజిత్ అగార్కర్కు ఇచ్చిపడేసిన యూవీ..!
2027 ODI World Cup: వెస్టిండీస్ పర్యటనకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంపికైనప్పటికీ, 2027 వన్డే ప్రపంచకప్ విషయంలో రోహిత్ స్థానంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పరిణామాలపై మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీకి బలమైన సూచనలు చేశారు. ఆఖరి నిమిషంలో మార్పులు చేయకుండా బలమైన కోర్ టీమ్ను తయారుచేయాలని స్పష్టం చేశారు.

2027 ODI World Cup: భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తలపడే పరిమిత ఓవర్ల సిరీస్ కోసం సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. ఈ పర్యటన అనంతరం న్యూజిలాండ్ (New Zealand) జట్టుతో కూడా టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్లతో 2027 వన్డే ప్రపంచకప్ (2027 ODI World Cup) సన్నాహాలు వేగవంతం కానున్నాయి. అయితే రాబోయే మెగా టోర్నీలో రోహిత్ ఆడడంపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) సెలెక్టర్లకు స్పష్టమైన సందేశం పంపించాడు. భవిష్యత్ టోర్నీలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా పటిష్టమైన కోర్ గ్రూప్ను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నాడు.
2007 టీ20 ప్రపంచకప్ (2007 T20 World Cup), 2011 వన్డే ప్రపంచకప్ (2011 ODI World Cup) విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువీ క్రిక్ఇన్ఫో (Cricinfo) తో మాట్లాడుతూ తన ఆలోచనలను పంచుకున్నాడు. ప్రధాన టోర్నీకి ఏడాది సమయం ఉండగానే నిర్దిష్ట బృందాన్ని సిద్ధం చేయాలని చెప్పాడు. ప్రస్తుతం వన్డేల కంటే టీ20 మ్యాచ్లు ఎక్కువగా జరుగుతున్నందున, అందుబాటులో ఉన్న కొద్దిపాటి మ్యాచ్లలోనే ఎంపిక చేసిన 16 లేదా 20 మంది ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ కల్పించడం చాలా అవసరమని గుర్తుచేశాడు.
కీలక సమయాల్లో జట్టులో భారీ మార్పులు చేయడం వల్ల గతంలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని యువరాజ్ గుర్తుచేశాడు. ఆఖరి క్షణంలో మార్పుల జోలికి వెళ్లకుండా, వరల్డ్ కప్ గెలవగలరని భావించిన ఆటగాళ్లకే విజయం లేదా వైఫల్యంతో సంబంధం లేకుండా పూర్తి మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత్ స్థిరంగా రాణిస్తున్నప్పటికీ, ప్రతికూల పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేలా జట్టును తీర్చిదిద్దడం తక్షణ కర్తవ్యమని యువరాజ్ తెలిపాడు. ఆస్ట్రేలియా (Australia) విజయాల వెనుక ఉన్న కారణాన్ని ప్రస్తావిస్తూ, ఆ జట్టులో వ్యక్తిగతంగా మ్యాచ్లను గెలిపించే వీరులు ఉంటారని విశ్లేషించాడు. ఒత్తిడి సమయాల్లో వారంతా ఒక్కటై మ్యాచ్ను లాగేసుకుంటారని, భారత్ కూడా అలాంటి మ్యాచ్ విన్నర్లను తీర్చిదిద్దుకోవాలని హితవు పలికాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
