అరెరె.. ఇన్నాళ్లు ఇది ఎలా మిస్సయ్యావ్.. ఇక నీకంటే తోపు లేడు పో.. సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Sunil Gavaskar Comments on Sanju Samson: అఫ్గానిస్థాన్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్తో చెలరేగి తనపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిచ్చాడు. కేవలం 22 బంతుల్లోనే 57 పరుగులు బాది జట్టుకు ఘనవిజయాన్ని అందించిన తీరుపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు.

Sunil Gavaskar Comments on Sanju Samson: టీమిండియా (Team India), అఫ్గానిస్థాన్ (Afghanistan) మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో సంజూ శాంసన్ (Sanju Samson) ఊచకోత కోశాడు. తొలి పోరులో కేవలం 10 పరుగులకే వెనుదిరగడం, మరోవైపు విధ్వంసకర ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) స్థానంలో సంజూను బరిలోకి దించడంపై తీవ్రమైన చర్చ నడిచిన సంగతి తెలిసిందే. ఆ విమర్శలన్నింటికీ తన బ్యాట్తోనే సమాధానం చెబుతూ 22 బంతుల్లోనే 57 పరుగులు సాధించాడు. సంజూ మెరుపు ఇన్నింగ్స్ దెబ్బకు ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించి, ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల ఈ ద్వైపాక్షిక సిరీస్ను భారత్ 2-0 ఆధిక్యంతో కైవసం చేసుకుంది.
సంజూ ప్రదర్శనపై భారత మాజీ సారథి సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ప్రత్యేకంగా మాట్లాడాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే భారీ షాట్లకు వెళ్లకుండా నెమ్మదిగా ఆడి, క్రీజులో కుదురుకున్న తర్వాత బౌండరీలతో విరుచుకుపడడం అద్భుతంగా ఉందని తెలిపాడు. ఓపెనర్లకు ఎక్కువ బంతులు ఆడే అవకాశం లభిస్తుంది కాబట్టి, భారీ లక్ష్యాల ఛేదనలో మినహా మిగిలిన సమయాల్లో ఇలా ఇన్నింగ్స్ను నిర్మించుకుంటే సంజూ ఇకపై ఏనాడూ విఫలం కాడని, ప్రతీ మ్యాచ్లోనూ 50 లేదా 60 పరుగులు సులువుగా సాధించగలడని సలహా ఇచ్చాడు.
గవాస్కర్తో పాటు ఇతర మాజీ క్రికెటర్లు మోహిత్ శర్మ (Mohit Sharma), మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) కూడా సంజూ ఆటతీరును కొనియాడారు. చాలా సందర్భాల్లో సంజూపై అనవసరమైన తొందరపాటు తీర్పులు ఇస్తుంటారని, అయితే ఈ మెరుపు ఇన్నింగ్స్తో తనపై జరుగుతున్న చర్చలన్నింటికీ ముగింపు పలికాడని క్రిక్బజ్ (Cricbuzz) చర్చా కార్యక్రమంలో మోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ఎక్కువమంది చదివినది: రోహిత్ శర్మతో విభేదాలతోనే అగార్కర్ గుడ్ బై.. రేసులో ఎవ్వరూ ఊహించని పేరు..?
ప్రపంచ ఛాంపియన్లు ఆడాల్సిన శైలిలోనే జట్టు ఆడిందని ప్రశంసించాడు. సంజూ తిరిగి పరుగులు సాధించడమే అత్యంత ముఖ్యమైన విషయమని కైఫ్ చెప్పుకొచ్చాడు. భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య చివరిదైన మూడో టీ20 కూడా గురువారం ఇదే మైదానంలో జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




