TG EAPCET 2026 Toppers: ఈఏపీసెట్ టాప్ ర్యాంకర్ల మార్కులు చూశారా? కాటాఫ్ భారీగా తగ్గడం వెనుక అసలు మర్మం అదే
రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీఎప్సెట్ 2026 ఫలితాలు మే 17న విడుదలైన సంగతి తెలిసిందే. రానున్న వారంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. టాప్ ర్యాంకర్లలో అబ్బాయిలు అధిక మంది ఉంటే.. ఉత్తీర్ణత శాతంలో మాత్రం అమ్మాయిలు టాప్ లేపారు..

హైదరాబాద్, మే 18: తాజాగా విడుదలైన ఈఏపీసెట్ ఫలితాల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చిలుకానగర్ (ఉప్పల్)కు చెందిన ఎం రుషి 160కి 156 మార్కులతో ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ టాపర్గా నిలిచాడు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో హైదరాబాద్ జిల్లా ఆసిఫ్నగర్కు చెందిన విద్యార్థి ముఖర్రమ్ అహ్మద్ 160కి 150 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచాడు. ఇంజినీరింగ్ స్ట్రీమ్లో టాప్ 10 ర్యాంకర్లలో ఏకంగా 8 మంది అబ్బాయిలు ఉండగా, కేవలం ఇద్దరు మాత్రమే అమ్మాయిలు ఉన్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలోనూ టాప్ 10లో ఏడుగురు అబ్బాయిలుండగా, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఏపీకి చెందిన వారు కూడా టాప్ 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. అయితే వీరికి అడ్మిషన్లు ఇవ్వబోమని అధికారులు ప్రకటించారు.
ఇంజినీరింగ్ విభాగంలో అమ్మాయిలు 73.72 శాతం ఉత్తీర్ణత పొందగా, అబ్బాయిలు 73.10 శాతం మంది క్వాలిఫై అయ్యారు. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు 0.62 శాతం అధికంగా అర్హత సాధించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో అమ్మాయిలు 86.76 శాతం, అబ్బాయిలు 84.70 శాతం చొప్పున ఉత్తీర్ణత సాధించారు. ఇందులోనూ అమ్మాయిలు 2.06 శాతం అధికంగా అర్హత సాధించారు. మరోవైపు ఈసారి ఈఏపీసెట్ ప్రశ్నలు కఠినంగా ఉండటంతో కటాఫ్ మార్కులు చాలా తక్కువగా ఇచ్చారు. ఇంజినీరింగ్లో 10వేల లోపు ర్యాంకు 62 మార్కులకే కటాఫ్ రావడం విశేషం. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 66 మార్కులకు 10లోపు ర్యాంకు కేటాయించారు. పదివేల లోపు ర్యాంకు వచ్చిన వారికి రెండు లక్షలలోపు వార్షిక ఆదాయం ఉంటే రిజర్వేషన్ క్యాటగిరీతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుంది.
తెలంగాణ ఈఏపీసెట్ 2026 టాప్ 10 ర్యాంకర్లు వీరే
- ఫస్ట్ ర్యాంక్.. ఎం.రుషి (ఉప్పల్) 156 మార్కులు
- సెకండ్ ర్యాంక్.. అన్షుల్ (మూసాపేట్) 148 మార్కులు
- థార్డ్ ర్యాంక్.. ఎం.వంశీధర్ రెడ్డి (పులివెందుల, కడప) 147 మార్కులు
- నాలుగో ర్యాంక్.. జే.రోషన్ మణిదీప్ ( గుంటూరు) 144 మార్కులు
- ఐదో ర్యాంక్.. ఎ.సాయి నిఖిత్ (మహబూబ్ నగర్) 143 మార్కులు
- ఆరో ర్యాంక్.. ఎం.ఆస్నా ( మేడ్చల్) 143 మార్కులు
- ఏడో ర్యాంక్.. వి.శరద్ మహేశ్వరీ (బంజారాహిల్స్) 142 మార్కులు
- ఎనిమిదో ర్యాంక్.. టి.శ్రేయాష్ రెడ్డి (కొండాపూర్) 140 మార్కులు
- తొమ్మిదో ర్యాంక్.. బొమ్మిరెడ్డి సమీరాజ్ రెడ్డి (ఎల్బీనగర్) 139 మార్కులు
- పదో ర్యాంక్.. రాపోలు జయంత్ శేఖర్ రెడ్డి (సుచిత్ర) 139 మార్కులు
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




