Inter Exams 2025: రేపట్నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. ఐదు నిమిషాలు ఆలస్యమైనా ఓకే!
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం (మార్చి 5) నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే ఇంటర్ బోర్డు హాల్టికెట్లను కూడా వెబ్సైట్లో ఉంచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్తోపాటు బ్రిడ్జి కోర్సు పరీక్షల హాల్టికెట్లను కూడా వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ రోల్ నంబర్, ఎస్ఎస్సీ హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్ టికెట్లను నేరుగా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు..

హైదరాబాద్, మార్చి 4: ఇంటర్మీడియట్ పరీక్షలకు ఈసారి కూడా ఒక్క నిమిషం ఆలస్యం నిబంధన ఎత్తివేస్తున్నట్లు తాజాగా ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రారంభమైన ఐదు నిమిషాల వరకు అంటే ఉదయం 9.05 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అయితే కాస్త ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకుంటే ఆందోళన లేకుండా రాసుకోవచ్చని, తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ముందుగా చేరుకునేలా చర్యలు తీసుకోవాలని ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సూచించారు. నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో విద్యార్ధులకు ఓఎంఆర్ పత్రాన్ని అందజేస్తారు. విద్యార్థులు పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిపై విద్యార్ధుల వివరాలు సరిగ్గా ఉన్నయో? లేదో? చెక్ చేసుకోవాలి.
విద్యార్ధులకు ముఖ్య సూచనలు..
- ఈసారి ఇంటర్ హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించడం జరిగింది. దాన్ని స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రం లొకేషన్ సులువుగా తెలుసుకోవచ్చు. పరీక్షకు ఒక రోజు ముందుగా కేంద్రాన్ని పరిశీలిస్తే అన్ని విధాలా మంచిది.
- అలాగే ప్రశ్నపత్రంపై సీరియల్ నంబరు కూడా ముద్రిస్తున్నారు. దీనిద్వారా ఏ సంఖ్య పేపర్.. ఏ విద్యార్థికి వెళ్తుందో సులువుగా తెలుస్తుంది. ఒకవేళ అది బయటకు వచ్చినా వెంటనే ఏ పరీక్షా కేంద్రం, ఏ విద్యార్థిదని తెలుసుకుంటారు.
- గతేడాది వరకు సాధారణ చేతిగడియారాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించిన అధికారులు.. ఈసారి స్మార్ట్ వాచ్లతోపాటు అనలాగ్ వాచ్లను కూడా బ్యాన్ చేస్తున్నట్ల అధికారులు తెలిపారు. అందుకే ఈసారి ఏ రకమైన చేతిగడియారాలనూ అనుమతించడం లేదు.
- ఇంటర్ బోర్డు కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)ని ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను ఈ కేంద్రంతో అనుసంధానిచ్చారు. మొత్తం 75 మంది సిబ్బంది పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తుంటారు.
- విద్యార్ధులకు పరీక్షలకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే బోర్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబరు 92402 05555 ను సంప్రదించవచ్చు.
కాగా మార్చి 5 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే మార్చి 6 నుంచి మొదలయ్యే ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 20వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసే అవకాశం ఉంది. వీరిలో అబ్బాయిలు 4,97,528 మంది ఉండగా.. 4,99,443 మంది వరకు అమ్మాయిలున్నారు. మొత్తం 1,532 (సెల్ఫ్ సెంటర్లు 49) పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




