Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 1 Mains Result Date: మరో పది రోజుల్లో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ఫలితాలు.. రీకౌంటింగ్‌కు ఛాన్స్‌!

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌ 1 పోస్టులకు ఇటీవల మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. అక్టోబర్‌ 21వ తేదీ నుంచి అక్టోబర్‌ 27వ తేదీ వరకు మొత్తం 7 పేపర్లకు ఈ పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ తాజాగా ముగిసింది. దీంతో మరో పది రోజుల్లోనే..

TGPSC Group 1 Mains Result Date: మరో పది రోజుల్లో టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 ఫలితాలు.. రీకౌంటింగ్‌కు ఛాన్స్‌!
TGPSC Group 1 Mains
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 07, 2025 | 3:45 PM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7: తెలంగాణ రాష్ట్రంలో 563 గ్రూప్‌ 1 పోస్టుల భర్తీకి ఇటీవల మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రూప్‌ 1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది. మెయిన్స్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా వెల్లడించేందుకు టీజీపీఎస్సీ తుది పరిశీలన చేస్తుంది. ఇది ముగిసిన వెంటనే వారం, పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అనంతరం మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేసి, తుది ఎంపిక జాబితా విడుదల చేస్తారు.

కాగా టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్‌ 21వ తేదీ నుంచి అక్టోబర్‌ 27వ తేదీ వరకు 7 పేపర్లకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 21,093 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. నిజానికి ప్రిలిమ్స్‌లో 31,383 మంది క్వాలిఫై అవగా.. వారిలో కేవలం 67.17శాతం మాత్రమే పరీక్ష రాశారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీపడుతున్నారు. గ్రూప్‌ 1 పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్‌ 2, ఆ తర్వాత గ్రూప్‌ 3 పరీక్షల ఫలితాలు వెల్లడించాలని కమిషన్‌ భావిస్తోంది. తద్వారా ఆయా పోస్టుల్లో బ్యాక్‌లాగ్‌లు లేకుండా అర్హులైన వారికి ఉద్యోగ ఇచ్చేలా చర్యలు తీసుకుంటోంది.

గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్‌సైట్లో పొందుపరచనున్నట్లు కమిషన్‌ పేర్కొంది. మొత్తం 7 పేపర్లలో తొలి పేపర్ క్వాలిఫైయింగ్ పేపర్‌ కావడంతో మిగిలిన ఆరు పేపర్లలో సాధించిన మార్కులను కలిపి మెరిట్‌ జాబితా ప్రకటించనుంది. సబ్జెక్టుల వారీగా మార్కులను అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మార్కుల లెక్కింపుపై సందేహాలుంటే రీకౌంటింగ్‌ ఆప్షన్‌ కూడా ఇస్తారు. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా వెల్లడించిన 15 రోజుల్లోగా అభ్యర్థులు ఒక్కో పేపర్‌కు రూ.1000 చొప్పున చెల్లించి రీకౌంటింగ్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 563 గ్రూప్‌ 1 సర్వీసు పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరి 19న ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.