TET పాసైన వారికి గుడ్న్యూస్.. MeeSeva కేంద్రాల ద్వారా ప్రింటెడ్ సర్టిఫికెట్లు జారీ!
TETలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. 2011 నుంచి ఇప్పటివరకు TET పాసైన వారందరికీ మీ సేవ కేంద్రాల ద్వారా ముద్రిత మెమోలను జారీ చేయనున్నారు. ఈ మెమోలపై అభ్యర్థి పేరు, ఫొటో, మార్కుల వివరాలతో పాటు ప్రత్యేక బార్కోడ్, సర్టిఫికెట్ నంబర్ ఉంటాయి. నకిలీ మెమోల తయారీకి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు..

హైదరాబాద్, ఆగస్ట్ 18: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు సంబంధించి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2011 నుంచి ఇప్పటివరకు TETలో అర్హత సాధించిన వారందరికీ మీ సేవ కేంద్రాల ద్వారా ముద్రిత మెమోలను జారీ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రింటెడ్ మెమోపై ప్రత్యేకమైన బార్కోడ్తో పాటు సర్టిఫికెట్ నంబర్ కూడా ఉంటుంది. అభ్యర్థి పేరు, ఫొటో, వేలిముద్ర లేదంటే సంతకం, పరీక్షలో సాధించిన మార్కుల వివరాలను మెమోలో పొందుపరచనున్నారు. మెమోను పొందేందుకు అభ్యర్థులు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
‘నకిలీ మెమోలకు చెక్ పెట్టేందుకే..’
గతంలో TETలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రెండుసార్లు ముద్రిత మెమోలు జారీ చేశారు. ఆ తర్వాత ఆన్లైన్ మెమోలను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ఆన్లైన్ మెమోలను ఆధారంగా చేసుకుని కొందరు నకిలీ మెమోలు తయారు చేస్తున్నట్లు విద్యాశాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో TETలో అర్హత సాధించిన ప్రతి అభ్యర్థికి ప్రత్యేక భద్రతా లక్షణాలతో కూడిన ముద్రిత మెమోను మీ సేవ కేంద్రాల ద్వారా అందించాలని నిర్ణయించింది. ఈ మెమోలు వారం నుంచి పది రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నవీన్ నికోలస్ తెలిపారు. రాష్ట్రంలోని మరో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వెల్లడించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందించేందుకు ఈ యూనిట్లు ఉపయోగపడనున్నాయి.
కొంపల్లిలోని శిక్షణ కేంద్రంలో అధునాతన వసతులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్పోర్ట్స్ ట్రాక్తో పాటు మరిన్ని సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. పనులు పూర్తయిన అనంతరం విద్యార్థులకు శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. అత్యుత్తమ సేవలు అందించిన వారికి త్వరలో సన్మానం నిర్వహించనున్నట్లు నవీన్ నికోలస్ తెలిపారు.




