AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఫోన్‌కు దూరం, నో కోచింగ్.. రోజుకు 8 గంటల చదువు’.. UPSC టాపర్‌ సాయి శివాని సక్సెస్ సీక్రెట్‌

వరంగల్‌కు చెందిన సాయి శివాని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2024లో అఖిల భారత 11వ ర్యాంకును సాధించి తెలంగాణకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారు. కోచింగ్‌పై ఆధారపడకుండా, తన రెండవ ప్రయత్నంలోనే ఈ ఘనతను సాధించడం విశేషం. పరీక్షకు సిద్ధమయ్యే క్రమంలో మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండి, దృష్టి మరల్చకుండా స్వీయ అధ్యయనంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు..

'ఫోన్‌కు దూరం, నో కోచింగ్.. రోజుకు 8 గంటల చదువు'.. UPSC టాపర్‌ సాయి శివాని సక్సెస్ సీక్రెట్‌
UPSC Topper Sai Shivani
Srilakshmi C
|

Updated on: Aug 18, 2026 | 10:11 AM

Share

తన తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ దాటలేకపోయిన సాయి శివాని, పట్టుదలతో మళ్ళీ ప్రణాళికను మార్చుకుని, జవాబు రాసే నైపుణ్యాలను మెరుగుపరచుకున్నారు. రోజువారీ అధ్యయన అలవాట్లు, ఆన్‌లైన్ వనరుల వినియోగం ఆమె విజయానికి దోహదపడ్డాయి. తన తండ్రి ఇచ్చిన నైతిక మద్దతు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం తనను మరింత ముందుకు నడిపిందని శివాని పేర్కొన్నారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపించారు. భవిష్యత్తులో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించి, పాలనను మరింత అందుబాటులోకి తేవాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు.

వరంగల్‌కు చెందిన ఎట్టబోయిన సాయి శివాని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2024లో అఖిల భారత 11వ ర్యాంకును కైవసం చేసుకుని దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఎటువంటి అధికారిక కోచింగ్ తీసుకోకుండా, వ్యక్తిగత మొబైల్ ఫోన్‌ను వినియోగించకుండా, స్వీయ క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ఆమె ఈ అద్భుత విజయాన్ని సాధించారు. సాయి శివాని పాఠశాల విద్య ఖమ్మంలో జరిగింది. పదవ తరగతి అనంతరం ఆమె ట్రిపుల్ ఐటీ ఒంగోలులో ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత, ఆమె వెంటనే సివిల్స్ ప్రిపరేషన్‌ను ఇంటి నుంచే ప్రారంభించారు. చిన్ననాటి నుంచే సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది తన కల అని శివాని వెల్లడించారు. ఇంజనీరింగ్ చదివినప్పటికీ, సమాజానికి సేవ చేయాలనే తపన, బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మార్పు తీసుకురావాలనే కోరిక తనను సివిల్స్ వైపు మళ్ళించాయని ఆమె తెలిపారు. దేశంలోని సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రజల జీవితాలను సులభతరం చేయడమే తన అతి పెద్ద ప్రేరణ అని అన్నారు.

తన తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ దశలో స్వల్ప తేడాతో విఫలమైనప్పుడు శివాని తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే, ఆమె తండ్రి అందించిన నైతిక మద్దతు, ప్లేస్‌మెంట్ జాబ్ అవసరం లేదు, మళ్ళీ బలంగా ప్రయత్నించు, నువ్వు చేయగలవు అనే మాటలు ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. ఈ ప్రోత్సాహంతో ఆమె మళ్ళీ బలమైన సంకల్పంతో ప్రిపరేషన్ ప్రారంభించారు. రెండవ ప్రయత్నంలో జవాబు రాసే నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంతో పాటు, సత్యం జైన్ సర్ వద్ద ఆన్‌లైన్‌లో మార్గదర్శకత్వం తీసుకున్నారు. ఇది ఆమెకు ప్రిలిమ్స్, మెయిన్స్ దశల్లో ఎంతో సహాయపడింది. తమ కుటుంబానికి టీవీ, సోషల్ మీడియాపై పెద్దగా ఆసక్తి ఉండదని, తమ లక్ష్యాలపై దృష్టి పెట్టాలనే మానసిక స్థితి ఇంట్లో ఎప్పుడూ ఉంటుందని సాయి శివాని పేర్కొన్నారు. ఇది తన ప్రిపరేషన్‌కు చాలా సహాయపడిందని తెలిపారు. ఆమె తండ్రి మెడికల్ రిప్రజెంటేటివ్ కాగా, తల్లి గృహిణి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, చదువుకు, మంచి పేరు సంపాదించుకోవడానికి తమ కుటుంబంలో ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. సాయి శివాని తన తల్లిదండ్రులు చేసిన త్యాగాలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వారికి మంచి జీవితాన్ని, గుర్తింపును ఇవ్వాలని ఆకాంక్షించారు.

ప్రిపరేషన్ సమయంలో రోజుకు 16-18 గంటలు చదవలేదని, సగటున 8 గంటలు అధ్యయనం చేశానని, పరీక్ష తేదీలు దగ్గర పడినప్పుడు మాత్రమే గంటలు పెరిగాయని ఆమె వివరించారు. భవిష్యత్తులో సివిల్ సర్వెంట్‌గా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, పాలనను సులభతరం చేయాలనేది తన లక్ష్యమని సాయి శివాని తెలిపారు. ఆమె తండ్రి మాట్లాడుతూ, చిన్నతనం నుంచే సాయి శివానిలో టాలెంట్ చూసి ఐఏఎస్ అవుతుందని నమ్మేవారన్నారు. బంధువుల నుంచి నిరుత్సాహం ఎదురైనప్పటికీ, ఆమె సామర్థ్యంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. సివిల్స్ ఆశావహులందరికీ ఆమె ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు.. ‘సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించడానికి ముందు అసలు మీరు ఎందుకు రాయాలనుకుంటున్నారో క్లారిటీ ఉండాలి. ఇందులో తక్షణ విజయం రాదు, ప్రక్రియకు ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది. క్రమశిక్షణ, స్థిరమైన కృషి, ఆత్మవిశ్వాసం చాలా అవసరం’ అని సూచించారు. సాయి శివాని విజయం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది.

Follow Us