TGPSC Group 2 Final List: గ్రూప్ 2 అభ్యర్థులకు ఎగిరి గంతేసే న్యూస్.. మరో 3 రోజుల్లోనే నియామక పత్రాలు అందజేత
TGPSC Group 2 appointment letters 2025: గ్రూప్ 2 సర్వీసు పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలు సెప్టెంబర్ 28న విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మిగిలిప ఒక పోస్టు మాత్రం భర్తీ కాలేదని, విత్ హెల్డ్లో పెట్టినట్లు వెల్లడించింది. ఇక గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది.

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలంగాణ గ్రూప్ 2 సర్వీసు పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలు సెప్టెంబర్ 28న విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మిగిలిప ఒక పోస్టు మాత్రం భర్తీ కాలేదని, విత్ హెల్డ్లో పెట్టినట్లు వెల్లడించింది. మొత్తం 16 శాఖల్లో 18 రకాల పోస్టులకు సంబంధించి టీజీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇక గ్రూప్ 2 పోస్టులకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది.
ఈ మేరకు సర్కార్ ప్రకటన వెలువరించింది. తాజా ప్రకటన మేరకు గ్రూపు 2 ద్వారా ఎంపికైన 783 మంది అభ్యర్థులకు అక్టోబరు 18వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా నియామక పత్రాలు అందించనున్నారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఆ రోజు సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. ఈ నియామకాల్లో సాధారణ పరిపాలన, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నుల శాఖలకు చెందిన వారే అధికంగా ఉన్నారు. అందువల్ల ఆయా శాఖల కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులతోపాటు వారి కుటుంబసభ్యులు కూడా ఈ కార్యక్రమానికి అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు.
కాగా టీజీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ను 2022లో విడుదల చేయగా, 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో రాతపరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,49,964 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష ఆఫ్లైన్ విధానంలో జరగడంతో ఓఎంఆర్ పత్రాల్లో లోపాలు, బబ్లింగ్ సరిగా చేయకపోవడం వంటి కారణాలతో దాదాపు 13,315 మందిని కమిషన్ అనర్హులుగా ప్రకటించింది. మిగిలిన 2,36,649 మంది అభ్యర్థుల జనరల్ ర్యాంక్ లిస్ట్ (మార్కులతో సహా)ను మార్చి 11న విడుదల చేసింది. గత నెలలో తుది జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ లిస్టులోని వారందరికీ మరో 3 రోజుల్లో నియామక పత్రాలు అందించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




