TG Govt Jobs 2025: నిరుద్యోగులకు సీఎం రేవంత్ భారీ శుభవార్త.. వచ్చే రెండేళ్లలో మరో 40 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
CM Revanth Reddy Promises 1 Lakh Jobs To Fulfilled In Next 2 Years: నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ తీపి కబురు చెప్పారు. త్వరలో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు హుస్నాబాద్ సభలో ప్రకటించారు. 2023 డిసెంబర్ 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, శ్రీకాంతాచారి బలిదానం ఇదే రోజు జరిగిందని గుర్తు చేశారు. ఆయన స్పూర్తితో..

హైదరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ తీపి కబురు చెప్పారు. రాబోయే 30 నెలల్లో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు బుధవారం (డిసెంబర్ 4) జరిగిన హుస్నాబాద్ సభలో ప్రకటించారు. 2023 డిసెంబర్ 3న పదేళ్ల పాలనకు ప్రజలు చరమగీతం పాడారని, శ్రీకాంతాచారి బలిదానం ఇదే రోజు జరిగిందని గుర్తు చేశారు. ఆయన స్పూర్తితో ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. త్వరలో మరో 40 వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం రేవంత్ ఈ సందర్భంగా తెలిపారు. రెండున్నరేళ్ల పాలనలో మొత్తం లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు.
హుస్నాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన తెలంగాణ ముఖ్యమంత్రి మరోసారి ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (BRS)పై దాడి చేశారు. ఆ పార్టీ హుస్నాబాద్ను విస్మరించి రాష్ట్రంలోని గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలను మాత్రమే అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు. ఈ మూడు అసెంబ్లీ స్థానాలను BRS అధినేత మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR), ఆయన కుమారుడు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు, కేసీఆర్ మేనల్లుడు సీనియర్ BRS నాయకుడు టి. హరీష్ రావు నిర్వహిస్తున్నారు.
రెండేళ్ల క్రితం ఇదే రోజున కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచింది. అప్పటి నుండి ‘ప్రజల ప్రభుత్వం’ వేడుకలను నిర్వహిస్తోంది. తెలంగాణలో నియంతృత్వ BRS పాలనను తమ పార్టీ గద్దె దించింది. ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా తమ ప్రభుత్వం తెలంగాణ ఆకాంక్షలను నెరవేరుస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ బీఆర్ఎప్ ప్రభుత్వంపై ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేస్తూ లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడు సంవత్సరాలలోనే కూలిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులను నిర్మించింది. అన్ని నిర్మాణాలు దశాబ్దాలుగా బలంగా ఉన్నాయని గుర్తు చేశారు. అయితే, గత BRS ప్రభుత్వం భారీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ ప్రాజెక్ట్ అక్రమాలకు BRS సభ్యులను బాధ్యులుగా పేర్కొంది.
హుస్నాబాద్ కు భారీగా నిధులు హుస్నాబాద్ అభివృద్ధికి భారీ నిధులను ప్రకటించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేసి, పెరుగుతున్న రుణ భారం నుంచి వారిని విముక్తి చేసిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రైతుల సంక్షేమం కోసం రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేసామన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం కోసం రూ.8,000 కోట్లు ఖర్చు చేశామని, స్వయం సహాయక సంఘాలను ఆర్టీసీ బస్సుల యజమానులుగా ప్రమోట్ చేసి, లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు జారీ చేసి, సన్నబియ్యం పంపిణీ చేశామని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని, 20 లక్షల ఇళ్ళు నిర్మిస్తుందని ఆయన అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్లుగా మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




