PG Admissions: బాబోయ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. వద్దే వద్దు! పీజీసెట్ను వ్యతిరేకిస్తున్న విద్యార్థులు.. కారణం ఇదే
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్ధులు ఆసక్తి చూపడం లేదు. దీంతో యేటేటా పీజీ ప్రవేశాలు అంతకంతకూ పడిపోతున్నాయి. సరైన చేరికలులేక వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని కోర్సుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. విద్యార్ధుల ప్రవేశాలు లేకపోవడంతో బోసిపోయి మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్ధులు ముందుకు రావడం లేదు. దీంతో యేటేటా పీజీ ప్రవేశాలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఒకప్పుడు సీట్లన్నీ నిండిపోయి కళకళలాడిన యూనివర్సిటీలు.. ఇప్పుడు సరైన చేరికలులేక వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని కోర్సుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. విద్యార్ధుల ప్రవేశాలు లేకపోవడంతో బోసిపోయి మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లో రాజకీయాలు వేళ్లూనుకున్నాయి. పైగా అవినీతి ఉండనే ఉంది. ఉమ్మడి ప్రవేశాలతో పెద్దఎత్తున నష్టం జరుగుతుందని, ఆయా వర్సిటీలకే పీజీ ప్రవేశాలు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తే మంచిదనే అభిప్రాయం అటు విద్యార్థులతోపాటు ఇటు ప్రొఫెసర్లలోనూ వ్యక్తమవుతోంది. అలాగే కోర్సుల ప్రక్షాళనపైనా దృష్టి సారించి నైపుణ్యాభివృద్ధితోపాటు ఉపాధికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాలని విన్నపాలు వస్తున్నాయి.
నిజానికి, 2019 వరకు రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీలే ప్రత్యేకంగా పీజీ సెట్లు నిర్వహించేవి. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ వాటికి స్వస్తి పలికి రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు కలిపి ఒకే ప్రవేశ పరీక్ష విధానాన్ని తీసుకువచ్చింది. 2020-21లో తొలిసారిగా ఏపీ పీజీసెట్ నిర్వహించింది. అలా ఇప్పటి వరకు నాలుగు సార్లు అన్ని యూనివర్సిటీలకు కలిపి ఉమ్మడిగా పీజీసెట్లు నిర్వహించారు. అయితే దరఖాస్తు చేసుకున్నా విద్యార్ధులు పరీక్షకు హాజరుకాకపోవడం, హాజరైనా సరైన కోర్సును ఎంపిక చేసుకోలేకపోవడం, దగ్గరలోని వర్సిటీలో చేరేందుకు అవకాశం లేకపోవడం, వ్యయభారం పెరగడం.. ఇలా పలుకారణాల వల్ల యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశాలు కుంటుపడ్డాయి.దీంతో సుదీర్ఘ చరిత్రగల ఎస్వీయూతో సహా పలు యూనివర్సిటీల్లో ప్రవేశాలు అడుగంటుకున్నాయి. పలు కోర్సులు ఏకంగా మూతపడ్డాయి కూడా. కొన్నింటిలో విద్యార్థుల సంఖ్య పదికి మించకపోవడం, మరికొన్ని విభాగాల్లో ప్రొఫెసర్లు తప్ప విద్యార్థులు లేరన్న విమర్శలు కూడా వస్తున్నాయి.
శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో ఇలా..
శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో 28 విభాగాలు 50 కోర్సులున్నాయి. ఇందులో 5,700 మంది విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారు. ఎంబీఏ, ఎంసీఏ, నర్సింగ్, ఇంజినీరింగ్, ఫార్మసీ వంటి కోర్సులు కాకుండా పీజీ కోర్సుల్లో మాత్రమే 984 సీట్లు ఉన్నాయి. 2019-20 సంవత్సరంలో చివరి సారిగా ఎస్పీఎంవీవీ పీజీసెట్ నిర్వహించారు. 2020 తర్వాత ఉమ్మడి ప్రవేశ పరీక్ష రావడంతో కోరుకున్న కోర్సుల్లో ప్రవేశాలు దొరక్క విద్యార్ధులు నిరాశ చెందుతున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షను రద్దు చేసి.. యూనిర్సిటీలకు ప్రత్యేకంగా పీజీసెట్లు నిర్వహహించేందుకు అనుమతి ఇస్తే పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉందని విద్యా నిపుణులు అంటున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




