నిరుద్యోగులకు శుభవార్త.. RRBలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు మరో 10 రోజుల్లో దరఖాస్తులు షురూ
RRB Section Controller Recruitment 2026 Notification: రైల్వే శాఖలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు RRB శుభవార్త చెప్పింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) దేశవ్యాప్తంగా సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి మరో వారంలో నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు..

రైల్వే శాఖలో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల భర్తీకి సిద్ధమవుతోంది. ఈ నియామకాల కోసం మూడవ కేంద్రీకృత ఉద్యోగ ప్రకటన (CEN-2)ను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సంక్షిప్త నోటిఫికేషన్ కొద్ది రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఈ నియామక ప్రక్రియలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్ఆర్బి జోన్లలో మొత్తం 119 సెక్షన్ కంట్రోలర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలోనైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఇది కూడా చదవండి: ONE = 314, TWO = 325, THREE = 538 అయితే SIX = ఎంత..? మ్యాథ్స్ కాదు లాజిక్ కావాలి..
ఎంపికైన అభ్యర్థులకు 6వ పే స్కేల్ ప్రకారం ప్రారంభ వేతనంగా నెలకు రూ.35,400 పొందుతారు. ఉద్యోగ భద్రతతో పాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు, ఇతర అలవెన్సులు కూడా లభించే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 20 సంవత్సరాలు, గరిష్టంగా 33 సంవత్సరాలు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఓబీసీ దివ్యాంగులకు 13 సంవత్సరాలు, ఎస్సీ/ఎస్టీ దివ్యాంగులకు 15 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము విషయానికి వస్తే.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EBC) అభ్యర్థులు రూ.250, ఇతర జనరల్ అభ్యర్థులు రూ.500 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. సీబీటీ పరీక్షకు హాజరైన వారికి రూ.400 రిఫండ్ చేస్తారు.
ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఉంటుంది. ఈ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, గణితం, లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం వైద్య పరీక్ష నిర్వహిస్తారు. ముఖ్యంగా కంటి చూపు పరీక్షకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు కేవలం ఒక ఆర్ఆర్బీ బోర్డు ద్వారానే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ముందుగా వన్టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అనంతరం ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్ను నింపాలి. ఆధార్ ధృవీకరణను తప్పనిసరిగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. ఆగస్టు 14, 2026వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రైల్వే రంగంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇతర వివరాలు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.
ఆర్ఆర్బీ సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




