JEE Main 2026 Exams: షెడ్యూల్ ప్రకారమే జేఈఈ మెయిన్ 2026 పరీక్షలు.. నిర్వహణకు కమిటీలు షురూ!
దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్ 2026 తొలి విడత రిజిస్ట్రేషన్లు నవంబర్ 27వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షలు జనవరి 21 నుంచి 30వ తేదీ మధ్య దేశ వ్యాప్తంగా..

హైదరాబాద్, డిసెంబర్ 13: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ మెయిన్ 2026 తొలి విడత రిజిస్ట్రేషన్లు నవంబర్ 27వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. ఇక జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షలు జనవరి 21 నుంచి 30వ తేదీ మధ్య దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్లు జనవరి 2026 మొదటి వారంలో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఇక అడ్మిట్ కార్డులు జనవరి 2026 మూడో వారంలో విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్ 2026 తొలి విడత ఫలితాలు ఫిబ్రవరి 12వ తేదీన విడుదల చేసేందుకు షెడ్యూల్ను రూపిందించారు. ఈ మేరకు షెడ్యూల్ ప్రకారం అభ్యర్ధులు తమ సన్నద్ధతను కొనసాగించవల్సి ఉంటుంది.
మరోవైపు జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షల సమీపిస్తుండటంతో వీటిని సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలను అధికారులు నియమిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణలోనూ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటుల చేశారు. ఈ కమిటీకి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఛైర్మన్గా, మరో ఆరుగురు సభ్యులుగా ఉంటారు. జిల్లాస్థాయి కమిటీకి జిల్లా మేజిస్ట్రేట్ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జారీ చేసే సూచనల్ని పూర్తిస్థాయిలో అమలు చేయడంలో పర్యవేక్షణ బాధ్యత కూడా కమిటీలదే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 12న ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే జేఈఈ పరీక్షలకు కాలిక్యులేటర్ తీసుకొచ్చేందుకు అనుమతి ఉండదు. జేఈఈ స్కోర్ ద్వారా ఎన్ఐటీ, ఐఐటీ, జీఎఫ్టీఐ వంటి ప్రతిష్టాత్మక ఇంజినిరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




