నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్లకు చివరి ఛాన్స్.. ఆగస్టు 7 వరకే అవకాశం
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే JNVST-2027 దరఖాస్తుల గడువును ఆగస్టు 7 వరకు పొడిగించారు. నవంబర్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి, భోజనం తదితర సౌకర్యాలు అందించనున్నారు..

దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో (JNVs) 2027-28 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష (JNVST) 2027 దరఖాస్తుల గడువును నవోదయ విద్యాలయ సమితి (NVS) పొడిగించింది. తాజా ప్రకటన మేరకు ఆగస్టు 7, 202వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించింది. తొలుత ప్రకటించిన నోటిఫికేషన్ మేరకు జులై 31వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే ఇంకా దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ తుది గడువును పొడిగించింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు ఆగస్టు 7వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఎంట్రన్స్ టెస్ట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 665 నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 16 వరకు జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పూర్తిగా ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం, పాఠ్యపుస్తకాలు తదితర సౌకర్యాలు అందిస్తారు.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఆసక్తి కలిగిన విద్యార్ధులు సంబంధిత జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న జిల్లాకు చెందిన నివాసి అయి ఉండాలి. అలాగే 3, 4, 5 తరగతులను గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదివి ఉండాలి. విద్యార్ధులు తప్పనిసరిగా మే 1, 2015 నుంచి జూలై 31, 2017 మధ్య జన్మించి ఉండాలి. 2026-27 విద్యా సంవత్సరంలో అదే జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన విద్యార్ధులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా ఉచితంగా అప్లై చేయవచ్చు. మొత్తం సీట్లలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తారు.
జవహర్ నవోదయ విద్యాలయ ఎంట్రన్స్ టెస్ట్ 2027ను నవంబర్ 28న నిర్వహించనున్నారు. పరీక్షలో మొత్తం 80 ప్రశ్నలు ఉండగా 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రంలో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. తెలుగు సహా ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ పలు భాషల్లో పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైన విద్యార్థులు సమీప జవహర్ నవోదయ విద్యాలయంలో అందుబాటులో ఉన్న ఉచిత హెల్ప్డెస్క్ సేవలను వినియోగించుకోవచ్చు. JNVST 2027 ఫలితాలు మార్చి 2027 చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది.
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




