విద్యార్ధులకు మళ్లీ నిరాశే.. AP EAPCET 2026 ఫలితాలు మరోమారు వాయిదా..! తప్పని ఎదురు చూపులు
AP EAPCET 2026 Results Postponed: లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈఏపీ సెట్ (AP EAPCET 2026) ఫలితాలు మళ్లీ వాయిదా పడ్డాయి. దీంతో విద్యార్ధులకు మళ్లీ ఎదురు చూపు తప్పనిసరైంది. నిజానికి, గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఈఏపీసెట్ ఫలితాలు జూన్ 1వ తేదీనే విడుదలవల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఇప్పటికే వరుసగా ఈ పరీక్ష ఫలితాలు వాయిదా పడ్డాయి. తాజాగా మరోమారు వాయిదా పడటంతో చర్చణీయంశంగా మారింది..

అమరావతి, జూన్ 30: రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఈఏపీ సెట్ (AP EAPCET 2026) ఫలితాలు మళ్లీ వాయిదా పడ్డాయి. దీంతో విద్యార్ధులకు మళ్లీ ఎదురు చూపు తప్పనిసరైంది. నిజానికి, గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఈఏపీసెట్ ఫలితాలు జూన్ 1వ తేదీనే విడుదలవల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల పలు దఫాలుగా ఈఏపీసెట్ ఫలితాల విడుదల వాయిదా పడింది. ఇక ఇటీవల అన్ని అడ్డంకులు తొలగిపోయి.. జూన్ 30న ఉదయం 11 గంటలకు ఫలితాలు వెల్లడిస్తామని స్వయంగా ఉన్నత విద్యామండలి ప్రకటించినప్పటికీ మళ్లీ ఈఏపేఈసెట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. అందుకు కారణం సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు పూర్తి స్థాయిలో రాకపోవడమేనని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఫలితాలు వాయిదా వేయమని విద్యార్థులు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. తిరిగా ఈఏపీసెట్ ఫలితాలను జులై 2 (గురువారం) ప్రకటించే అవకాశం ఉంది.
కాగా ఈ ఏడాది ఈఏపీసెట్ ఆన్లైన్ పరీక్షలు మే 12 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 3.29 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షల అనంతరం జూన్ 1 నాటికే దీని ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈఏపీసెట్ ఫలితాల్లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. దీంతో ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఈ ఏడాది కొత్తగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చేంత వరకు అధికారులు ఫలితాలను వెల్లడించలేదు. వీటి ఫలితాలు వచ్చాక అంతా సర్దుమనిగించిదే అని అనుకునేలోపు సీబీఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చే వరకు అధికారులు ఆగాలని భావించడంతో.. ఫలితాల వెల్లడిలో జాప్యం నెలకొంది.
సీబీఎస్ఈ 12వ తరగతి సమాధాన పత్రాల వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ ఫలితాలను పూర్తి స్థాయిలో విడుదల చేయడం పూర్తయితే ఏ అడ్డంకి ఉండదు. ఈఏపీసెట్ ర్యాంకుల విషయంలో విద్యార్ధులు ఎవరూ నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈఏపీసెట్ ఫలితాల విడుదలను ఈ మేరకు పలు మార్లు వాయిదా వేసింది. మరోవైపు తెలంగాణలో ఇప్పటికే ఈఏపీసెట్ ఫలితాలు వెల్లడించగా.. కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.




