AP ECET 2025 Notification: ఏపీ ఈసెట్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?
పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) పూర్తి చేసిన విద్యార్థులకు బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్ 2025) నోటిఫికేషన్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) విడుదల చేసింది..

అమరావతి, మార్చి 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఫార్మసీ కోర్సు ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్ 2025) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసెట్ ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ఏపీ ఈసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ శ్రీనివాసరావు, కన్వీనర్ ప్రొఫెసర్ భానుమూర్తి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఏప్రిల్ 7, 2025వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.
ఇక మే 6వ తేదీన అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్ష రెండు షిఫ్టుల్లో ఉంటుంది. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇక ఈసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలు, వయోపరిమితి, ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు గడువు వంటి వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. మొత్తం వివరాలతో కూడి పూర్తి నోటిఫికేషన్ మార్చి 10వ తేదీన విడులద చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి పేర్కొంది.
కాగా ఏపీ ఈసెట్లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) పూర్తి చేసిన విద్యార్థులకు బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే. అగ్రికల్చర్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, బయో టెక్నాలజీ, సెరామిక్ టెక్నాలజీ, ఈఈఈ, ఈసీఈ, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జికల్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు పరీక్షలు జరుగుతాయి. ఇక ఈ ఏడాది కూడా ఏపీ ఈసెట్ 2025 పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపురం నిర్వహిస్తోంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.