AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karachi Bakery: కరాచీ బేకరీ యజమాని ఎవరు? పాకిస్తాన్‌తో సంబంధం ఏంటి?

Karachi Bakery: భారతదేశం - పాకిస్తాన్ విభజన విషాదాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఖాన్‌చంద్ రామ్నాని తన నలుగురు కుమారులతో కలిసి పాకిస్తాన్‌లోని సింధ్ నుండి హైదరాబాద్‌కు వచ్చారు. అతనికి సింధ్‌లో ఆహారం, బేకరీ వ్యాపారం ఉండేది. భారతదేశానికి వచ్చేటప్పుడు అతను కరాచీ నగరం..

Karachi Bakery: కరాచీ బేకరీ యజమాని ఎవరు? పాకిస్తాన్‌తో సంబంధం ఏంటి?
Subhash Goud
|

Updated on: May 12, 2025 | 6:58 PM

Share

భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితి మొత్తం ప్రపంచంలో కలకలం సృష్టించింది. ఈ ఉద్రిక్తత వేడి హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో ఉన్న కరాచీ బేకరీకి కూడా చేరింది. పాక్‌- భారత్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో నిరసనకారులు బేకరీ పేరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బేకరీ పేరు మార్చుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కరాచీ బేకరీ నిరసనలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు 2019లో పుల్వామా దాడి సమయంలో ఈ బేకరీ కూడా ధ్వంసమైంది. ఇంతకీ కరాచీ బేకరీ పేరు మీద ఎందుకు గొడవ జరుగుతోంది? దానికి పాకిస్తాన్ తో ఏదైనా సంబంధం ఉందా? దాని యజమాని ఎవరు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

విభజన ద్వారా బేకరీ పునాది:

1947 విభజన సమయంలో భారతదేశం – పాకిస్తాన్ విభజన విషాదాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఖాన్‌చంద్ రామ్నాని తన నలుగురు కుమారులతో కలిసి పాకిస్తాన్‌లోని సింధ్ నుండి హైదరాబాద్‌కు వచ్చారు. అతనికి సింధ్‌లో ఆహారం, బేకరీ వ్యాపారం ఉండేది. భారతదేశానికి వచ్చేటప్పుడు అతను కరాచీ నగరం జ్ఞాపకాలను, కొన్ని ప్రత్యేక వంటకాలను తనతో తీసుకువచ్చాడు. ఈ జ్ఞాపకాలకు గౌరవసూచకంగా అతను హైదరాబాద్‌లోని తన దుకాణానికి ‘కరాచీ బేకరీ’ అని పేరు పెట్టాడు. 1953లో ఖాన్‌చంద్ హైదరాబాద్‌లోని మొజంజాహీ మార్కెట్‌లో కరాచీ బేకరీకి పునాది వేశారు. ఈ బేకరీ పేరు పాకిస్తాన్‌లోని కరాచీ నగరం నుండి ప్రేరణ పొందింది. కానీ దీనిని ఒక భారతీయ కుటుంబం నిర్వహిస్తోంది.

వ్యాపారం విస్తరణ:

ఈ సింధీ వ్యాపారవేత్త ఖాన్‌చంద్ రామ్నాని 1960లలో క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించాడు. అతను చేతితో తయారు చేసిన స్వీట్స్‌, ఉస్మానియా బిస్కెట్లను అమ్మడం ప్రారంభించాడు. ఇది హైదరాబాద్ ప్రజలకు ఇష్టమైనవిగా మారాయి. ప్రారంభంలో అతను టోకు వ్యాపారుల నుండి బేకరీ ఉత్పత్తులను కొనుగోలు చేసి అమ్మేవాడు. కానీ తరువాత అతను తన సొంత ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించాడు. 2007లో రామ్నాని కుటుంబం నగరంలోని సంపన్న ప్రాంతమైన బంజారా హిల్స్‌లో రెండవ శాఖను ప్రారంభించింది. తరువాత ఖాన్‌చంద్ కుమారుడు లేఖరాజ్, రామ్నాని కుటుంబంలోని ఇతర సభ్యులు ఈ బేకరీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపించారు. ప్రస్తుతం బేకరీ యజమానులు రాజేష్, హరీష్ రామ్నాని.

అనేక నగరాల్లో అవుట్‌లెట్‌లు:

కరాచీ బేకరీకి ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా అనేక నగరాల్లో శాఖలు ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, దీనికి హైదరాబాద్‌లోనే 24 అవుట్‌లెట్‌లు ఉన్నాయి. ఈ బేకరీలోని పండ్లు, ఉస్మానియా బిస్కెట్లు అత్యంత ప్రసిద్ధి చెందాయి. దీని ఉత్పత్తులు US, కెనడా, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, గల్ఫ్ దేశాలతో సహా 20 కి పైగా దేశాలలో కూడా అమ్ముడవుతున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి