Economic Progress: సరిలేరు మనకెవ్వరూ..మన ఆర్థిక వ్యవస్థకు ఐక్యరాజ్యసమితి కితాబు
భారతీయులందరూ గర్వపడే ఓ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉంటే, భారతదేశం మాత్రం ప్రగతిపథంలో దూసుకుపోతోందని తెలిపింది. ఇది మన పాలకులు, ప్రజలు, వ్యాపారవేత్తల సమర్థతకు నిదర్శనంగా నిలిచింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. దానిలో మన ఆర్థిక వ్యవస్థ పెరుగుదలను కొనియాడింది. ఈ నివేదికను ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం (డీఈఎస్ఏ)లోని ఆర్థిక విశ్లేషణ, విధాన విభాగంలోని గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ బ్రాంచ్ తయారు చేసింది.

ఐక్యరాజ్యసమితి నివేదికలో అనేక విషయాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత దేశ ఆర్థిక వృద్ధిని 6.3 శాతంగా అంచనా వేసింది. ఇది పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే అత్యధికమని తెలిపింది. ఈ ప్రగతి 2026 వరకూ కొనసాగుతుందని, మొత్తానికి 6.4 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2025లో 2.4 శాతానికి మందగిస్తుందని అంచనా వేసింది.
ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిహద్దు వివాదాలు ఎక్కువయ్యాయి. దేశాల విధానాల్లో మార్పులు సంభవించాయి. దీంతో పెట్టుబడుల్లో క్షీణత ఏర్పడింది. ఇదే సమయంలో భారత దేశంలో అభివృద్ధి గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఉత్సాహభరితమైన మూలధన మార్కెట్లు, మంచి ఉత్పత్తులు, రికార్డు స్థాయిలో ఎగుమతులు, బలమైన రక్షణరంగం దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
మంచి విధాన ఎంపికలు, బలమైన దేశీయ డిమాండ్, స్థిరమైన ప్రభుత్వ వ్యయం కూడా మన ఆర్థిక వృద్ధికి కారణాలని చెప్పవచ్చు. వీటితో ప్రజలకు చక్కని ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలాగే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2025 నాటికి ద్రవ్యోల్బణం 4.3 శాతం తగ్గుతుందని అంచనా వేశారు.
మన ఆర్థిక మార్కెట్లు కూడా ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. పెట్టుబడిదారులకు స్టాక్ లు లాభాలను ఆర్జించిపెడుతున్నాయి. అనుకూల విధానాలు, బయట డిమాండ్ కారణంగా తయారీ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. రక్షణ ఉత్పత్తి వంటి రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి. వీటి ద్వారా మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడమే కాకుండా ప్రపంచంలో మనకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. దానికి ఈ కింద తెలిపిన గణాంకాలే నిదర్శనమని చెప్పవచ్చు.
- దశాబ్దంలో తయారీ రంగం గణనీయమైన ప్రగతిని సాధించింది. తయారీకి సంబంధించిన స్థూల విలువ జోడింపు (జీవీఏ) 2013-14లో రూ.15.6 లక్షల కోట్ల నుంచి 2023-24 నాటికి రూ.2.75 లక్షల కోట్లకు పెరిగింది.
- 2024-25లో దేశ ఎగుమతులు రికార్డు స్థాయిలో 82.4 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి.
- 2023-24లో రక్షణ ఉత్పత్తి సరికొత్త రికార్డులు నమోదు చేసింది. స్వదేశీ తయారీ విలువ రూ.1,27,434 కోట్లకు పెరిగింది. ఇది 2014-15లో రూ.46,429 కోట్లు మాత్రమే ఉండేది.
- దేశ రక్షణ ఎగుమతులు 2024-25లో రూ.23,622 కోట్లకు పెరిగాయి. ఇవి 2013-14లో కేవలం రూ.686 కోట్లు మాత్రమే ఉండేవి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








