Mutual funds: మ్యూచువల్ ఫండ్స్ లో అధిక రాబడి కావాలా..? ఈ జాగ్రత్తలు తీసుకుంటే లాభాల పంటే
డబ్బులు సంపాదించాలని, ఆస్తులను కూడబెట్టాలని, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీని కోసం వివిధ పెట్టుబడి మార్గాల్లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తారు. వాటి నుంచి అధిక రాబడి పొంది ఆర్థిక స్థిరత్వం సాధించాలని భావిస్తారు. బ్యాంకులు అమలు చేసే ఫిక్స్ డ్ డిపాజిట్ పథకాల (ఎఫ్ డీలు)లో గతంలో డబ్బులను పెట్టుబడి పెట్టేవారు. ఇప్పుడు వాటితో పాటు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటికి ఇటీవల ఆదరణ బాగా పెరిగింది. అయితే వీటిలో పెట్టుబడి పెట్టేముందు పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఉత్తమ మ్యూచువల్ ఫండ్ ను ఎలా ఎంపిక చేసుకోవాలో తెలుసుకుందాం.

పెట్టుబడిదారుల నుంచి డబ్బులను సేకరించి, వాటితో వివిధ స్టాక్ లు, బాండ్లు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసే వాటినే మ్యూచువల్ ఫండ్స్ అంటారు. వీటిని స్టాక్ మార్కెట్ లో అనుభవం కలిగిన మేనేజర్లు నిర్వహిస్తారు. పెట్టుబడిదారుడికి అధిక రాబడి అందించడమే వీరి ప్రధాన లక్ష్యం. పెట్టుబడిదారులు ఆయా మ్యూచువల్ ఫండ్స్ లో వాటాలు, యూనిట్లు కలిగి ఉంటారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ)లో మ్యూచువల్ ఫండ్స్ రిజస్టర్ అయి ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. దానిలో భాగంగా అవి ఎన్ని రకాలు, వాాటి వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ అనే మూడు రకాలు ఉంటాయి.
ఈక్విటీ ఫండ్స్
బహిరంగంగా వ్యాపారం నిర్వహిస్తున్న వివిధ సంస్థల్లో స్టాక్ లు, ఈక్విటీని కలిగి ఉన్న పెట్టుబడి సంస్థలను ఈక్విటీ ఫండ్స్ అంటారు. ధీర్ఘకాలంలో మూలధనం పెంచడం, రాబడిని సంపాదించడం వీటి ప్రధాన లక్ష్యం. దీని కోసం పెట్టుబడి దారుల నుంచి నిధులు సేకరించి, స్టాక్ లను కొనుగోలు చేస్తాయి.
డెట్ ఫండ్స్
బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, స్థిర ఆదాయ ఆస్తులు తదితర డెట్ సాధనాలలో పెట్టుబడిని పెడతాయి. పెట్టుబడిదారుల నుంచి డబ్బులను సమీకరించి, వాటిని కొనుగోలు చేస్తాయి.
హైబ్రిడ్ ఫండ్స్
స్టాక్ లు, బాండ్లు తదితర ఒకటి కంటే ఎక్కువ విభిన్న ఆస్తి తరగతులను కలిగిన ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ను హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. అధిక రాబడి, స్థిరమైన ఆదాయం పొందేందుకు ఉపయోగపడతాయి.
- మ్యూచువల్ ఫండ్స్ ను కొనుగోలు చేసే ముందుకొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. పెట్టుబడి పెట్టే ముందుగానే మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఎంత పెట్టుబడి పెడుతున్నారు, రాబడి ఎంత రావాలనుకుంటున్నారో అంచనా వేసుకోవాలి.
- మార్కెట్ ఒడిదొడుకులకు లోబడి మ్యూచువల్ ఫండ్స్ నుంచి రాబడి ఉంటుంది. వాటిని అంచనా వేయడం అసాధ్యం. అయినా మార్కెట్ హెచ్చుతగ్గులను అర్థం చేసుకుంటూ ఉండాలి.
- మీకు ఎప్పుడైనా అవసరమైనప్పుడు డబ్బులను ఉపసంహరించుకోవడానికి వీలున్న ఫండ్స్ ను ఎంపిక చేసుకోవాలి.
- మీ ఫండ్ మేనేజర్ వ్యూహాలు, తెలివితేటలతో పోర్టుపోలియోను విస్తరించుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రాబడి కూడా పెరుగుతుంది.
- మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చిన రాబడిపై ఆదాయపు పన్ను చెల్లించాలి. ఆ విషయంపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి







