AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాన రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ సమస్య.. పరిష్కారానికి ఐఐటీ-హైదరాబాద్‌ సేవలు

సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు భారత రైల్వే కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యంతో సమగ్ర ట్రాఫిక్ అంచనా అధ్యయనాలు నిర్వహించనుంది. డ్రోన్లు, ఏఐ/మెషిన్ లెర్నింగ్ ఆధారిత సీసీటీవీ విశ్లేషణ, క్షేత్రస్థాయి సర్వేలు, ట్రాఫిక్ సిమ్యులేషన్ల ద్వారా డేటా ఆధారిత పరిష్కారాలను రూపొందించనున్నారు.

ప్రధాన రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ సమస్య.. పరిష్కారానికి ఐఐటీ-హైదరాబాద్‌ సేవలు
Secunderabad Railway Station
Janardhan Veluru
|

Updated on: Aug 28, 2026 | 4:28 PM

Share

సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకీ పెరిగిపోతోంది. దీన్ని తగ్గించి రైల్వే ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేసేందుకు భారత రైల్వే(Indian Railways) కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, ఐఐటీ హైదరాబాద్ భాగస్వామ్యంతో సమగ్ర ట్రాఫిక్ అంచనా అధ్యయనాలు నిర్వహించనుంది. దీనికి సంబంధించి ఒప్పందం కుదిరింది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్, సికింద్రాబాద్, లింగంపల్లి రైల్వే స్టేషన్లలో సమగ్ర ట్రాఫిక్ అంచనా అధ్యయనాలను చేపట్టేందుకు ఐఐటీ హైదరాబాద్ సేవలను భారత రైల్వేస్ వినియోగించుకోనుంది.  రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సులభమైన రాకపోకలు, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, బహుళ రవాణా వ్యవస్థల అనుసంధానాన్ని మెరుగుపరచడం ఈ అధ్యయనాల ప్రధాన లక్ష్యం.

ఈ అధ్యయనంలో వాహనాలు, పాదచారుల రాకపోకల అంచనావేయడం, ట్రాఫిక్ సర్క్యులేషన్, రాకపోకలకు అవసరమైన ప్రణాళిక, బహుళ రవాణా వ్యవస్థల అనుసంధానం చేయనున్నారు. అలాగే ట్రాఫిక్ అవరోధాల గుర్తింపు, స్టేషన్ ప్రాంగణంలోని పార్కింగ్, ప్రయాణికుల రాకపోకలకొసం సజావైన ఏర్పాట్లు, జంక్షన్లు,  సిగ్నళ్ల మెరుగుదల, అలాగే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణ చర్యలను సమగ్రంగా పరిశీలించనున్నారు. డ్రోన్ ల ద్వారా నిఘా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ ) / మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్ ) ఆధారిత సీసీటీవి విశ్లేషణ, ప్రయాణికుల క్షేత్రస్థాయి సర్వేలు, ట్రాఫిక్ సిమ్యులేషన్లను వినియోగించి, డేటా ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేయనున్నారు. వీటి ద్వారా ప్రయాణికుల భద్రత, రైల్వే స్టేషన్ల నిర్వహణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ డివిజన్ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో, ఇంజినీరింగ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్ ), ఆపరేటింగ్ విభాగాలతో పాటు ఇతర సంబంధిత బాహ్య భాగస్వాముల సమన్వయంతో చేపడుతున్నారు. సికింద్రాబాద్, లింగంపల్లి స్టేషన్లలో కొనసాగుతున్న ప్రధాన పునరాభివృద్ధి పనులకు కూడా ఈ అధ్యయనం విలువైన సూచనలను అందించనుంది. వీటిద్వారా సిఫారసు చేయబడిన పరిష్కారాలను భవిష్యత్ స్టేషన్ మౌలిక సదుపాయాల్లో సమర్థవంతంగా అనుసంధానించేందుకు వీలు కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

సికింద్రాబాద్ డివిజన్, డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్ ప్రస్తుత ట్రాఫిక్ సవాళ్లకు సమర్థవంతమైన, డేటా ఆధారిత పరిష్కారాలను అందించడంలో ఈ అధ్యయనం కీలకంగా నిలుస్తుందని, అలాగే ఇలాంటి పరిష్కారాలను ఇతర ప్రధాన రైల్వే స్టేషన్లలోనూ అమలు చేసే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పెరుగుతున్న ట్రాఫిక్‌రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ఐఐటీ-హైదరాబాద్‌తో కలిసి సమగ్ర ట్రాఫిక్ అంచనా అధ్యయనాన్ని చేపడుతున్న సికింద్రాబాద్ డివిజన్ కృషిని అభినందించారు.

Follow Us