AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హార్ముజ్‌ మూసివేస్తే.. మేం వేరే మార్గం తెరుస్తాం: సౌదీ అరేబియా ప్రభుత్వం

మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, హార్ముజ్ జలసంధి అంతరాయాల నేపథ్యంలో సౌదీ అరేబియా తన చమురును ఎర్ర సముద్రం లోని యాన్బు పోర్టు ద్వారా తరలిస్తోంది. ఇది కీలకమైన ప్రత్యామ్నాయ మార్గంగా ఉన్నప్పటికీ, పైప్‌లైన్ సామర్థ్య పరిమితులు ఆసియా కొనుగోలుదారుల పై ప్రభావం చూపుతున్నాయి.

హార్ముజ్‌ మూసివేస్తే.. మేం వేరే మార్గం తెరుస్తాం: సౌదీ అరేబియా ప్రభుత్వం
Saudi Arabia
SN Pasha
|

Updated on: Mar 16, 2026 | 5:34 PM

Share

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా కీలకమైన సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధి వద్ద అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రత్యామ్నాయంగా ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించడం ప్రారంభించింది. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం సౌదీ ప్రభుత్వం తన దీర్ఘకాలిక చమురు కొనుగోలుదారులకు ఎర్ర సముద్రంలోని యాన్బు పోర్ట్‌ ద్వారా ముడి చమురు సరఫరా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గంగా గుర్తింపు పొందిన హార్ముజ్ జలసంధిలో సమస్యలు కొనసాగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా సౌదీ చమురు సరఫరా ఎక్కువగా పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని టెర్మినల్స్ నుంచి జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సరఫరా అంతరాయాల ప్రమాదాన్ని తగ్గించడానికి ఎర్ర సముద్ర పోర్టును వినియోగిస్తున్నారు.

నివేదికల ప్రకారం యాన్బు పోర్టు ద్వారా సరఫరా పొందే కొనుగోలుదారులు తమ నెలవారీ చమురు కేటాయింపులో కొంత భాగాన్ని మాత్రమే పొందగలరు. కారణం, దేశం మీదుగా ఎర్ర సముద్రానికి ముడి చమురును తరలించే పైప్‌లైన్ సామర్థ్యానికి పరిమితులు ఉండటమే. ఈ పైప్‌లైన్ రోజుకు సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల చమురును తరలించగలదని అంచనా. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా ఉన్న సౌదీ అరమ్‌కో గతంలో రోజుకు సుమారు 7.2 మిలియన్ బ్యారెళ్ల చమురును ప్రధానంగా గల్ఫ్ టెర్మినల్స్ అయిన రాస్ తనురా టెర్మినల్, జుయ్మా టెర్మినల్ ద్వారా ఎగుమతి చేసేది. ప్రస్తుతం ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడాల్సి వస్తోంది.

ఈ పరిస్థితి ఆసియా దేశాలపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చైనాలో అతిపెద్ద రిఫైనింగ్ సంస్థ అయిన సినోపెక్ సరఫరా తగ్గడంతో తన రిఫైనరీ కార్యకలాపాలను దాదాపు 10 శాతం వరకు తగ్గించినట్లు సమాచారం. అలాగే జపాన్‌ తన జాతీయ నిల్వల నుంచి ముడి చమురును విడుదల చేయడం ప్రారంభించింది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న సంఘర్షణ ఎంతకాలం కొనసాగుతుందో, హార్ముజ్ జలసంధి ఎప్పుడు పూర్తిగా తెరవబడుతుందో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ప్రపంచ చమురు మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతోంది. పరిస్థితి మరింత కాలం కొనసాగితే, చమురు సరఫరా మార్గాలు, అంతర్జాతీయ వాణిజ్య విధానాల్లో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us