Gold Reserves: టన్నుల కొద్దీ బంగారం కొంటున్న ఆర్బీఐ.. దీని వెనుక బలమైన కారణమే ఉందిగా..
దేశ ఆర్థిక వృద్ధి అనేది ఆ దేశంలో ఉండే బంగారు నిల్వలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అన్ని దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు తమ కరెన్సీ స్థిరత్వానికి బంగారం కొనుగోలుపై దృష్టి పెడతాయి. ఈ క్రమంలో ఆర్బీఐ కూడా బంగారం నిల్వలపై దృష్టి కేంద్రీకరించింది. పెద్ద స్థాయిలో బంగారం కొనుగోలుపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో బంగారం నిల్వల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

2024లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 73 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో బంగారం కొనుగోలులో ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద సంస్థగా నిలిచింది. కరెన్సీ అస్థిరతతో పాటు రీవాల్యుయేషన్ నష్టాన్ని తగ్గించే ఉద్దేశంతో నిల్వలను వైవిధ్యపరచడానికి ఆర్బీఐ బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. జనవరి 31 నాటికి భారతదేశ విదేశీ మారక నిల్వలు 630.6 బిలియన్లు డాలర్లుగా ఉన్నాయి. అందులో బంగారం భాగం దాదాపు 70.89 బిలియన్ల డాలర్లు ఉన్నాయి. ఈ విలువ క్రమంగా పెరుగుతుంది. డిసెంబర్ 2024 చివరి నాటికి ఆర్బీఐ వద్ద బంగారం నిల్వ 876.18 టన్నులుగా ఉంది. కేంద్ర బ్యాంకులు సాధారణంగా ప్రపంచ బులియన్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు, ఇతర కేంద్ర బ్యాంకులు అలాగే బులియన్ డీలర్ల నుంచి బంగారాన్ని కొనుగోలు చేస్తాయి.
ఆర్బీఐ 2009లో అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 200 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి కొనుగోళ్లు చిన్న విడతలుగా జరిగాయి. ఆ తర్వాత 2024లో కొనుగోలు చేసిన బంగారమే రెండో స్థానంలో ఉంది. కేంద్ర బ్యాంకులు సాధారణంగా బంగారాన్ని వాణిజ్య లేదా బులియన్ బ్యాంకులు, డీలర్లు, ఓపెన్ మార్కెట్ అలాగే రిఫైనర్లకు విక్రయిస్తాయి. అనేక బ్యాంకులు బంగారాన్ని విక్రయిస్తున్నప్పటికీ అవి నికర కొనుగోలుదారులుగా ఉన్నాయి. అయితే ఆర్బీఐ చాలా ఏళ్ల నుంచి బంగారాన్ని విక్రయించలేదు. 1991లో విదేశీ మారక ద్రవ్య సంక్షోభం సమయంలో, ఆర్బీఐ తన బంగారు నిల్వల్లో కొంత భాగాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్కు 405 మిలియన్ల డాలర్ల రుణం పొందడానికి తాకట్టు పెట్టింది. అదే సంవత్సరంలో రుణాన్ని తిరిగి చెల్లించినప్పటికీ, ఆర్బీఐ బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల్లోనే ఉంచింది.
ప్రపంచంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అతిపెద్ద బంగారు ఖజానాల్లో ఒకటి కలిగి ఉంది. ఇక్కడే అనేక కేంద్ర బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేస్తాయి. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా పెద్ద ఖజానాలను కలిగి ఉంది. విదేశాల్లో నిల్వ చేసిన బంగారాన్ని వ్యాపారం చేయడానికి, స్వాప్లలో ప్రవేశించడానికి, రాబడిని సంపాదించడానికి సులభంగా ఉపయోగించవచ్చు. అయితే గత సంవత్సరం ఆర్బీఐ విదేశీ ఖజానాల నుంచి 202 టన్నుల బంగారాన్ని తరలించింది. 2024 ఆర్థిక సంవత్సరం కోసం సెంట్రల్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం భారతదేశంలో 308 మెట్రిక్ టన్నులకు పైగా బంగారం నిల్వ చేసింది. అలాగే బ్యాంకింగ్ శాఖ ఆస్తిగా మరో 100.28 టన్నులు స్థానికంగా ఉన్నాయి. అయితే మొత్తం బంగారు నిల్వల్లో 413.79 మెట్రిక్ టన్నులు విదేశాల్లో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








