Gold: ఈ పండక్కి గోల్డ్ స్కీమ్ ప్లాన్ చేస్తున్నారా.? లాభమా, నష్టమా తెలుసుకోండి..
బంగారానికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. ధర ఎంత పెరిగినా బంగారాన్ని కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం తగ్గదు. భారతీయుల్లో బంగారానికి ఉన్న క్రేజ్ ఏంటో చెప్పేందుకు ఇదే నిదర్శనం. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో పలు జువెలరీ సంస్థలు గోల్డ్ స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చాయి..
బంగారాన్ని, భారతీయులను విడదీసి చూడలేమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పండక్కి బోనస్ వచ్చినా, ఏదైనా చిట్టి ఎత్తినా ముందుగా వచ్చే కాస్త బంగారాన్ని కొనేద్దాం. ఇదిగో ఈ ఆలోచనే బంగారం ఉన్న వారి ఆర్థికి పరిస్థితికి డోకా లేకుండా చేస్తోంది. ఎటు పోయి ఎటు వచ్చినా బంగారం మనల్ని కాపాడుతందనే భరోసానే బంగారాన్ని కొనుగోలు చేయడానికి కారణమని చెబుతుంటారు.
స్థిరమైన, నమ్మదగిన పెట్టుబడి ఎంపిక కాబట్టే చాలా మంది గోల్డ్లో పెట్టుబడి పెడుతుంటారు. ముఖ్యంగా దీపావళి లాంటి పండుగలు వస్తే ఎంతో కొంత గోల్డ్ను కొనుగోలు చేస్తుంటారు. ఇక ఇటీవల ప్రముఖ జువెలరీ సంస్థలన్నీ గోల్డ్ స్కీమ్స్ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇంతకీ గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది.? ఇది పెట్టుబడికి మంచి ఆప్షనేనా కాదా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గోల్డ్ డిపాజిట్ పథకాలు పెట్టుబడిదారులు నెల నెల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ఉపయోగపడతాయి. దీంతో నిర్ణీత వ్యవధిలో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఆభరణాలు లేదా బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. కస్టమర్లను ఆకర్షించే క్రమంలో తనిష్క్, జోయాలుకాస్ వంటి సంస్థలు రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి. తనిష్క్ గోల్డెన్ హార్వెస్ట్ పేరుతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా కస్టమర్లు 10 నెలల పాటు పెట్టుబడులు పెట్టొచ్చు. డిపాజిట్ చేసిన మొత్తంపై మంచి రాబడి సైతం పొందొచ్చు.
ఇక ఇలాంటి గోల్డ్ స్కీమ్స్లో పెట్టుబడి మొత్తం రూ. 50 వేలు దాటితే.. సెక్షన్ 56(2)(x) కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిబేట్ నేరుగా నగదు రూపంలో చెల్లించరు. తనిష్క్, రిలయన్స్ రిటైల్, సెంకో గోల్డ్ వంటి రిటైలర్లలో నెలవారీ డిపాజిట్ స్కీమ్లకు పెరుగుతున్న డిమాండ్.. భారతీయుల్లో బంగారంపై ఇష్టాన్ని స్పష్టం చేస్తుందని మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్ పాల్కా అరోరా చోప్రా చెప్పారు.
అయితే మరోవైపు సావరిన్ గోల్డ్ బాండ్లు లేదా గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు) వంటి వాటికి కూడా ఆదరణ లభిస్తోంది. ఇదిలా ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం.. డిసెంబర్ 2018లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా శక్తికాంత దాస్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి భారతదేశ విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా 211 శాతం పెరిగింది. డిసెంబర్ 7, 2018 నాటికి $21.150 బిలియన్లతో పోలిస్తే, అక్టోబర్ 4, 2024 నాటికి మొత్తం నిల్వలలో బంగారం వాటా $65.756 బిలియన్లుగా ఉందని RBI డేటా స్పష్టం చేస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..