Onions: మండుతున్న ఉల్లిపాయల ధరలు.. సామాన్యులకు మరో షాక్.. కిలో ఎంతంటే..?
ఉల్లిపాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులకు మరింత ఘాటెక్కిస్తున్నాయి. గత నెల క్రితం కిలో రూ.20 నుంచి రూ.302 మధ్య లభించగా.. ఇప్పుడు డబుల్ అయ్యాయి. ఖరీఫ్ సీజన్ పంట మార్కెట్లోకి రాకపోవడంతో సరఫరా తగ్గిపోయింది. ఈ కారణంతో ధరలు మండిపోతున్నాయి.

సామాన్యులకు బిగ్ షాక్ తగిలింది. ఉల్లిపాయల ధరలు ఒకేసారి భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పంచదార ధరలు పెరగ్గా.. ఇప్పుడు ఉల్లిపాయల ధరలు కూడా అమాంతం పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దేశంలో ఎల్నివో ప్రభావంతో వర్షాలు పడకపోవడం వల్ల పంటసాగు ఆలస్యవుతోంది. దీంతో ఉల్లి సరఫరా తగ్గిపోగా.. మార్కెట్లో డిమాండ్ కూడా పెరిగిపోయింది. ఈ కారణంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత రెండు వారాలుగా క్రమక్రమంగా ధరలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఉల్లిపాయలు రబీ సీజన్లో వచ్చినవి. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఉల్లి మార్కెట్లోకి ఇంకా రాలేదు. దీంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారాలు చెబుతున్నారు.
ఒకేసారి రూ.70కి చేరుకున్న ఉల్లి
ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి రూ.42గా పలుకుతోంది. ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో రూ.65 నుంచి రూ.70 వరకు ఉంది. ఇక హైదరాబాద్, ముంబైలో కిలో ఉల్లిపాయలు రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఉల్లి ధరలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ ధరకు అందించేందుకు కందా ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటి ద్వారా ఉల్లి సరఫరా చేస్తోంది. గత ఏడాది అక్టోబర్లో కూడా కేంద్రం ఇదే తరహాలో ప్రత్యేక రైళ్లను నడపగా.. ఇప్పుడు కూడా అదే తరహాలోనే అధిక ధరలు ఉన్న ప్రాంతాలకు తిప్పనుంది. ఢిల్లీ, చెన్నై, కొచ్చి, గువహటి వంటి నగరాలకు నాసిక్ ద్వారా ఉల్లిపాయలను సరఫరా చేస్తోంది. ఉల్లి ధరలు పెరుగుదల క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. బఫర్ స్టాక్ నుంచి ఉల్లిని విడుదల చేయాలని నిర్ణయించింది. నాసిక్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా పెంచనుంది.
ధరల పెరుగుదలకు కారణాలివే..
తెలుగు రాష్ట్రాల్లో గత నెలలో కిలో ఉల్లి రూ.20 నుంచి రూ.30 మధ్య లభించగా.. ఇప్పుడు ప్రాంతాలను బట్టి రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతోంది. నెల రోజుల్లోనే ధరలు రెండింతలు పెరిగాయి. ఇక విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఏపీలోని అన్ని ప్రాంతాల్లో ఉల్లిపాయల ధరలు పెరిగాయి. దీంతో రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయనే ఆందోళన సామాన్యుల్లో నెలకొంది. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన ఉల్లి మార్కెట్కు రాకపోవడంతో సరఫరా గణనీయంగా తగ్గింది. డిమాండ్కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. హోల్ సేల్ మార్కెట్లలో ధరలు పెరగ్గా.. రిటైల్ మార్కెట్లపై కూడా ఈ ప్రభావం పడుతుంది. వంటిల్లో ఉల్లి లేనిది ఏ పని జరగదు. ఏ వంటలోకి అయినా ఉల్లి అనేది తప్పనిసరి.
