Gas Cylinder Prices: సామాన్యులకు మరో షాక్.. మే 1 నుంచి పెరగనున్న గ్యాస్ సిలిండర్ ధరలు..?
సామాన్యులకు మరో షాక్ తగలనుందా.. గ్యాస్ ధరలు మళ్లీ పెరగనున్నాయా.. అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో గ్యాస్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో మే 1వ తేదీ నుంచి గ్యాస్ ధరలు పెరిగే అవకాశముంది.

ఇంట్లో ఎల్పీజీ గ్యాస్ వాడేవారికి షాక్ తగలనుందా..? సిలిండర్ల ధరలు భారీగా పెరగనున్నాయా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటం, హర్ముజ్ జలసంధి నుంచి సరుకు రవాణా నిలిచిపోవడంతో గ్యాస్ ధరలపై దీని ప్రభావం పడుతుంది. ఇక గల్ప్ దేశాల్లో కూడా సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. దీంతో మే 1 నుంచి వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరగవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రతీ నెలా 1వ తేదీన కొత్త గ్యాస్ ధరలను కంపెనీలు ప్రకటిస్తూ ఉంటాయి. మరో 2 రోజుల్లో కొత్త నెల వస్తుండటంతో గ్యాస్ ధరలు ఎలా ఉంటాయనే చర్చ హాట్టాపిక్గా మారింది.
మరోసారి పెరగనున్న ధరలు..?
ఇప్పటికే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.60 మేర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయ. ఇక వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు రూ.218 వరకు పెరిగాయి. మార్చి 7న ధరలను పెంచగా.. ఏప్రిల్ 1వ తేదీన కమర్షియల్ సిలిండర్ ధరల్లో మళ్లీ మార్పులు చేశారు. ఇక ప్రస్తుతం హర్ముజ్ జలసంధి నుంచి సరుకు రవాణా మెరుగుపడలేదు. దీంతో మే 1న ధరలను మరోసారి పెంచే అవకాశముందని చెబుతున్నారు. ఇక గ్యాస్ డెలివరీ సమయంలో ఓటీపీని తప్పనిసరిగా అందించాలి. ఓటీపీని నమోదు చేశాకే కస్టమర్కు గ్యాస్ సిలిండర్ అందించాలి. గ్యాస్ సిలిండర్లలో అక్రమాలను అరికట్టేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గ్యాస్ బుకింగ్ చేసుకున్నా కస్టమర్కు ఓటీపీతో కూడిన నెంబర్ వస్తుంది. డెలివరీ సమయంలో ఇది అందించాల్సి ఉంటుంది. ఓటీపీ కన్ఫార్మ్ చేసిన తర్వాతనే సిలిండర్ అందిస్తారు. దీని వల్ల నిజమైన కస్టమర్కు మాత్రమే గ్యాస్ అందుతుంది. గ్యాస్ పంపిణీలో అక్రమాలకు దీని వల్ల చెక్ పడుతుంది. ఇటీవల గ్యాస్ కొరత క్రమంలో ఓటీపీ ధృవీకరణను కేంద్రం తప్పనిసరి చేసింది.
కేవైసీ తప్పనిసరి
ఇక గ్యాస్ వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి. తమ ఆధార్ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి కేవైసీ పూర్తి చేయాలి. ఆన్లైన్ ద్వారా ఇంట్లోనే ఉండి కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాన్ని సంప్రదించి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అంతేకాకుండా డెలివరీ బాయ్ దగ్గర ఉండే బయెమెట్రిక్ మిషన్ల ద్వారా కూడా కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. కేవైసీ పూర్తి చేయకపోతే ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీలు నిలిచిపోతాయి. అలాగే గ్యాస్ బుకింగ్, సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చు.
