Indian Railways: ట్రైన్లో వస్తువులు మర్చిపోయారా..? ఈ ఒక్క నెంబర్కు కాల్ చేస్తే తిరిగి మీ చేతికి..
ట్రైన్లో ప్రయాణం చేసే సమయంలో వస్తువులను సీటుపై పెట్టి మర్చిపోతుంటారు. దీంతో వాటిని వేరేవాళ్లు తీసుకెళ్లడం లాంటివి జరుగుతుంటాయి. ఇలా వస్తువులను పొగోట్టుకోవడం జరుగుతుంది. అయితే మీరు ఈ పని చేయడం ద్వారా వస్తువులను తిరిగి రాబట్టుకోవచ్చు. ఈ మేరకు రైల్వేశాఖ అవకాశం కల్పిస్తోంది.

ట్రైన్ ప్రయాణాన్ని ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. ప్రతీఒక్కరూ ఒక్కసారైనా రైలులో ప్రయాణం చేసి ఉంటారు. రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తరచుగా తమ జేబుల్లోంచి మొబైల్ ఫోన్లు లేదా పర్సులు తీసి సీట్లపై పెడతారు. కానీ రైలు దిగేటప్పుడు వాటిని తిరిగి తీసుకోవడం మర్చిపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడం ఎలా అనేది చాలామందికి తెలియదు. ఎవరిని సంప్రదించాలో తెలియక అయోమయానికి గురవుతూ ఉంటారు. పొగోట్టుకున్న వస్తువు ఇక రావడం కష్టమేనని వదిలేస్తుంటారు. అయితే ట్రైన్లో మర్చిపోయిన వస్తువును తిరిగి రాబట్టుకోవడం సాధ్యమేనా? తిరిగి ఎలా రాబట్టుకోవాలి? ఎవరిని సంప్రదించాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
వెంటనే కాల్ చేయండి
రైలులో ఏదైనా వస్తువును మీరు పోగొట్టుకుంటే వెంటనే 139కి లేదా సమీపంలోని రైల్వే సిబ్బందికి ఫోన్ చేయాలి. ప్రయాణికుల సౌకర్యం, భద్రత రైల్వేశాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులు తమ సామాను పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ ఏదైనా పోగొట్టుకుంటే వెంటనే 139కి కాల్ చేయాలి. లేదా సమీపంలోని రైల్వే సిబ్బందికి తెలియజేయాలి. ఎంత త్వరగా సంప్రదిస్తే అంత మంచిది. త్వరగా కాల్ చేయడం ద్వారా మీ వస్తువులను తిరిగి రాబట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆలస్యమైతే వస్తువును తిరిగి రాబట్టుకోవడం కష్టతరంగా మారుతుంది. 139కి కాల్ చేసి మీ సమస్యను వివరించాలి. కోచ్ నెంబర్, సీటు నెంబర్, పీఎన్ఆర్ నెంబర్ లాంటివి చెప్పాలి. దీంతో రైల్వే సిబ్బంది వెంటనే స్థానిక అధికారులకు సమాచారం అందిస్తారు. దీంతో స్థానిక అధికారులు అలర్ట్ అయి మీ సామాన్లను తిరిగి తీసుకురావడంలో సహాయపడతారు.
యాప్ ద్వారా ఫిర్యాదు ఎలా..?
ఇక ఫోన్ నెంబర్ సాయంతోనే కాకుండా యాప్ ద్వారా కూడా ప్రయాణికులు ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం రైల్వే వన్ యాప్లోకి వెళ్లాలి. ఫిర్యాదుల సెక్షన్లోకి వెళ్లాలి. మీ పీఎన్ఆర్ నెంబర్, కోచ్ నెంబర్ ,సీటు నెంబర్, ఏ వస్తువు పొగోట్టుకున్నారు, మర్చిపోయిన వస్తువులో ఏయేవి ఉన్నాయి అనే వివరాలు లాంటివి అందించాలి. దీంతో అధికారులు సంప్రదించి వెంటనే చర్యలు తీసుకుంటారు. మీ వస్తువును మీకు తిరిగి ఇవ్వడంతో సాయం అందిస్తారు. ఇందుకోసం ప్రత్యేక టీమ్ అనేది ఉంటుంది. ఆ టీమ్ సమాచారం తెలుసుకోగానే వెంటనే అప్రమత్తం అవుతుంది. మీరు మర్చిపోగానే వెంటనే సంప్రదించే ప్రయోజనం ఉంటుంది. అదే ఆలస్యమైతే మీ వస్తువును తిరిగి రాబట్టుకోవడం కష్టతరంగా మారవచ్చు.
