భారతీయ రైల్వే పట్టాలపైకి సరికొత్త ట్రైన్.. అస్సలు పొగ రాదు.. దీన్ని ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కే..
పర్యావరణానికి ఎంతో మేలు చేసే, అస్సలు పొగ రాని దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కడానికి సర్వం సిద్ధమైంది. ఈ అద్భుతమైన గ్రీన్ టెక్నాలజీని వాడుతున్న ప్రపంచంలోని కొన్ని అత్యంత ప్రతిష్టాత్మక దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా చేరబోతుంది. ప్రధాని మోదీ జూలై 17న జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైలు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం..

భారతదేశాన్ని నెట్ జీరో కార్బన్ ఉద్గారాల దిశగా తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రోజన్ రైలు ప్రాజెక్ట్ తుది దశకు చేరుకుంది. పర్యావరణానికి ఎటువంటి హాని చేయని, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జూలై 17న హర్యానాలోని జీంద్ రైల్వే స్టేషన్ నుండి జెండా ఊపి ప్రారంభించే అవకాశం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. భారతీయ రైల్వే ఈ హైడ్రోజన్ రైలు పైలట్ ప్రాజెక్ట్ కోసం హర్యానా రాష్ట్రాన్ని ఎంచుకుంది. ఈ రైలు క్రమం తప్పకుండా జీంద్ – సోనిపట్ మధ్య ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.
రైలు వేగం ఎంత?
ఈ రైలును గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేశారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా జీంద్ సోనిపట్ రూట్లో దీని సాధారణ వేగాన్ని గంటకు 75 కిలోమీటర్లుగా నిర్ణయించారు. గత రెండున్నర నెలలుగా ఈ రైలును గంటకు 75 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ట్రాక్లపై విజయవంతంగా పరీక్షించారు.
అస్సలు పొగ రాదు.. కేవలం నీటి ఆవిరే
ఈ రైలు పూర్తిగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఇందులో హైడ్రోజన్ గ్యాస్ సహాయంతో విద్యుత్తును తయారు చేసి రైలును నడుపుతారు. ఈ ప్రక్రియ వల్ల వాతావరణంలోకి ఎలాంటి ప్రమాదకరమైన కార్బన్ ఉద్గారాలు లేదా పొగ రావు. కేవలం నీటి ఆవిరి మాత్రమే పర్యావరణంలోకి విడుదలవుతుంది. అందుకే దీనిని 100శాతం పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థగా పిలుస్తున్నారు.
ప్రయాణికుల సామర్థ్యం – ఇంధన నిల్వ
ఈ రైలులో 2 డ్రైవింగ్ పవర్ కార్లు, 8 ప్యాసింజర్ కోచ్లు ఉంటాయి. ఇందులో 682 సీటింగ్ సామర్థ్యం ఉండగా.. మొత్తంగా 2,600 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించవచ్చు. రైలులో ఒకేసారి 440 కిలోల కంప్రెస్డ్ హైడ్రోజన్ను స్టోర్ చేసుకోవచ్చు. పూర్తి స్థాయిలో నడిచేటప్పుడు ఈ రైలు రోజుకు దాదాపు 300 కిలోల హైడ్రోజన్ను వినియోగిస్తుంది.
భద్రతకు అత్యంత ప్రాధాన్యత..
హైడ్రోజన్ ఇంధనం కాబట్టి భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించారు. దీని డిజైన్ను అంతర్జాతీయ ధృవీకరణ సంస్థ TUV SUD పరీక్షించి ఆమోదించింది. జీంద్లో హైడ్రోజన్ స్టోరేజ్, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అనుమతులు లభించాయి. గ్యాస్ లీకేజీలను గుర్తించేందుకు హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్టర్లతో పాటు 24 గంటల పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రారంభ దశలో రైలుతో పాటు శిక్షణ పొందిన సాంకేతిక సిబ్బంది కూడా ప్రయాణిస్తారు.
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ సాంకేతికతను భవిష్యత్ ఇంధనంగా ప్రపంచం భావిస్తోంది. ఈ రైలు ప్రారంభంతో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి అగ్రదేశాల సరసన భారత్ నిలవనుంది. దేశీయంగా హరిత ఇంధన వాడకాన్ని పెంచడంలో మరియు కాలుష్య రహిత రవాణా వ్యవస్థను నిర్మించడంలో ఈ ప్రాజెక్ట్ భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.
